టాలీవుడ్ను కాపాడుకుంటాం
ABN , First Publish Date - 2020-11-23T07:40:27+05:30 IST
‘‘తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల
పార్టీ మేనిఫెస్టోలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలు
నష్టాల నుంచి కోలుకోవడానికి రాయితీలు, మినహాయింపులు
ప్రగతిభవన్లో సినీ పెద్దలతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్
‘‘తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటాం. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మ్యానిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల పరిశ్రమకు, కార్మికులకు జరిగిన నష్టాల నుంచి కోలుకోవడానికి.. ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు.
పరిశ్రమకు కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు. వారి అభ్యర్థనకుసీఎం సానుకూలంగా స్పందించారు. ‘‘రాష్ట్రానికి పరిశ్రమలు తరలిరావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? దేశంలో ముంబై, చెన్నైతో పాటు హైదరాబాద్లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతోంది. కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇటు ప్రభుత్వం, అటు సినిమా పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయాలి.’’ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రముఖ కథానాయకులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కళ్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై, సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు.