విశాఖ ఉక్కును కాపాడుకుందాం

ABN , First Publish Date - 2022-01-28T06:41:24+05:30 IST

ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని తిరుపతిలో గురువారం జరిగిన అఖిలపక్ష సదస్సు తీర్మానించింది.

విశాఖ ఉక్కును కాపాడుకుందాం
సదస్సులో ప్రసంగిస్తున్న నారాయణ

అఖిల పక్ష సదస్సు తీర్మానం - 23న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపు


తిరుపతి(కల్చరల్‌), జనవరి 27: ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని తిరుపతిలో గురువారం జరిగిన అఖిలపక్ష  సదస్సు తీర్మానించింది. ఇందుకోసం ఫిబ్రవరి 23వ తేదీన  రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్వులు కందారపు మురళి, పి.మురళి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎల్‌.రత్నకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో  పలు పార్టీ నేతలు ప్రసంగించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు సీహెచ్‌ నర్సింగరావు, డి.ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాదిగా విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కరోనా కాలంలోనూ రూ.700 కోట్ల లాభాలు రాగా, రూ.పదివేల కోట్ల టర్నోవర్‌ సాధించిన లక్షల కోట్ల విలువైన పరిశ్రమను దక్షిణ కొరియాలోని పోక్సో కంపెనీకి కారుచౌకగా అప్పజెప్పాలని కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్లుగా ఉన్న బండారు దత్తాత్రేయ, హరిబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ప్రైవేటీకరణ ఆగిపోదా అని ప్రశ్నించారు. పోరాటమే విశాఖ ఉక్కును కాపాడుతుందని, ప్రజలందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్‌, టీయన్‌టీయూసీ నేతలు రఘురామరాజు, పొత్తూరి రెడ్డెప్పనాయుడు, కాంగ్రెస్‌ నేత నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్పీఐ నేత పి.అంజయ్య, టి.సుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, కీర్తన, విజయలక్ష్మి, అంబూరి సింధూజ, జి. బాలసుబ్రహ్మణ్యం, సాంబశివ, తదితరులు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉంటామన్నారు. కలెక్టర్‌తో మీటింగ్‌ ఉండటం వల్ల సభకు రాలేక పోతున్నానని పోరాటానికి తన సంఘీభావాన్ని తెలియజేస్తున్నానని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప చెప్పినట్లు నేతలు పేర్కొన్నారు.  


విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఎన్నిక

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీని నూతనంగా ఎంపిక చేశారు. చైర్మన్‌గా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మురళి, కన్వీనర్‌గా ఐఎన్‌టీయూసీ నేత ఎల్‌.రత్నకుమార్‌, కోకన్వీనర్‌గా సీఐటీయూ నేత కందారపు మురళితోపాటు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

Updated Date - 2022-01-28T06:41:24+05:30 IST