ఆ మూడూ ఐడీ ప్రూఫ్లే : ఆధార్ ప్రాధికార సంస్థ
ABN , First Publish Date - 2020-10-21T22:25:26+05:30 IST
వ్యక్తిగత గుర్తింపు రుజువుగా లెటర్, ఈ-ఆధార్, పీవీసీ కార్డు
న్యూఢిల్లీ : వ్యక్తిగత గుర్తింపు రుజువుగా లెటర్, ఈ-ఆధార్, పీవీసీ కార్డు సమానంగా చెల్లుబాటవుతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తెలిపింది. ప్రజలు తమకు సౌకర్యవంతంగా ఉన్నదానిని ఎంపిక చేసుకుని, ఉపయోగించుకోవచ్చునని వివరించింది. అన్ని రకాల ఆధార్ రూపాలు సమానంగా ఆమోదించదగినవేనని, ఒకదానికి మించి మరొకదానికి ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదని స్పష్టం చేసింది.
వ్యక్తి గుర్తింపు కోసం యూఐడీఏఐ 12 అంకెల సంఖ్యను జారీ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలను పొందేందుకు ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో యూఐడీఏఐ బుధవారం ఇచ్చిన ట్వీట్లో వివరణ ఇచ్చింది. ఆధార్ జనరేట్ అయిన తర్వాత పోస్టు ద్వారా వచ్చే లెటర్, ఈ-ఆధార్, పీవీసీ కార్డు సమానంగా చెల్లుబాటవుతాయని, ప్రజలు తమకు సౌకర్యంగా ఉండే ఆధార్ పత్రాన్ని ఉపయోగించుకోవచ్చునని తెలిపింది. సరైన తనిఖీతో వీటిలో దేనినైనా ఐడెంటిటీ ప్రూఫ్గా ఆమోదించవచ్చునని పేర్కొంది. వీటిలో ఒకదానికి మించి మరొకదానికి ప్రాధాన్యం ఇవ్వనక్కర్లేదని పేర్కొంది.
ఆధార్ పీవీసీ కార్డు
దీనిని పీవీసీతో తయారు చేస్తారు. దీనిపై డిజిటల్ సిగ్నేచర్, క్యూఆర్ కోడ్, కార్డు హోల్డర్ చిరునామా వివరాలు ఉంటాయి. దీనికి అనేక సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. uidai.gov.in లేదా resident.uidai.gov.in ద్వారా రూ.50 చెల్లించి, పీవీసీ ఆధార్ కార్డును పొందవచ్చు. మొబైల్ నంబరు రిజిస్టర్ చేయించుకోనివారు కూడా వేరొక మొబైల్ నంబరుతో ఆర్డర్ చేయవచ్చు.