ఉద్యోగులకు ఎల్ జీ పాలిమర్స్ టాటా...

ABN , First Publish Date - 2021-01-06T00:55:10+05:30 IST

ఎల్ జీ పాలిమర్స్ .... గుర్తుండే ఉంటుంది. ఈ సంస్థ పేరు వినగానే గుర్తుకు వచ్చేది విషవాయువుల లీకేజీ ఘటన. గతేడాది మే ఏడో తేదీన ఈ కంపెనీ నుండి స్టైరిన్ వాయువు లీకవ్వడంతో పన్నెండు మంది మృతిచెందగా, కొన్ని వందల మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

ఉద్యోగులకు  ఎల్ జీ పాలిమర్స్ టాటా...

విశాఖపట్నం : ఎల్ జీ పాలిమర్స్  .... గుర్తుండే ఉంటుంది. ఈ సంస్థ పేరు వినగానే గుర్తుకు వచ్చేది విషవాయువుల లీకేజీ ఘటన. గతేడాది మే ఏడో తేదీన ఈ కంపెనీ నుండి స్టైరిన్ వాయువు లీకవ్వడంతో పన్నెండు మంది మృతిచెందగా, కొన్ని వందల మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కంపెనీలో ఉత్పత్తి నిలిచిపోయింది. అదే సమయంలో జనావాసాల మధ్య నుంచి కంపెనీని మరోచోటకు తరలించాలన్న డిమాండ్ కూడా తెరమీదకు వచ్చింది. అయితే... దీనిపై అటు ప్రభుత్వం గానీ, ఇటు కంపెనీ యాజమాన్యం గానీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ క్రమంలోనే ‘వీఆర్ఎస్’ తేరమీదకు వచ్చింది. 


కంపెనీలో మొత్తం 248 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 370 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. కాగా... శాశ్వత ఉద్యోగులందరూ వీఆర్ ఎస్ తీసుకోవాలని ఆదేశించిన యాజమాన్యం...అందుకు గత నెల 19 వ తేదీని గడువుగా నిర్ణయించింది. వీఆర్‌ఎస్ కు దరఖాస్తు చేయకపోతే కంపెనీ నిబంధనలకు లోబడి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఆ సమయానికి 49 మంది అధికారులు వీఆర్ ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరోసారి గడువివ్వాలని యాజమాన్యం నిర్ణయించినట్టు సమాచారం. ఈ ఏడాది మార్చి 31లో గా మొత్తం అధికారులు ఉద్యోగులకు వీఆర్ ఎస్ ఇచ్చేయాలని యాజమాన్యం వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు వినవస్తోంది. 


కాగా కంపెనీలో 370 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. వీరికి రోజుకు అన్ని మినహాయింపులూ పోను రూ. 530 చెల్లించేది. అయితే ప్రమాద ఘటన అనంతరం జూన్ నుంచి మూడు నెలల పాటు పూర్తిగా సెప్టెంబరు నుంచి సగం వేతనాలను చెల్లించింది. డిసెంబరు 31 తరువాత కాంట్రాక్టు ఉద్యోగులకు కంపెనీతో సంబంధం లేదని యాజమాన్యం ప్రకటించింది. యాజమాన్యం నిర్ణయం నేపధ్యంలో  వందలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. కాగా... జిల్లా యంత్రాంగం ఈ విషయంపై దృష్టిసారించి తమకు తగిన పరిహారం అందేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు.

Updated Date - 2021-01-06T00:55:10+05:30 IST