సొంత భవనం లేని గ్రంథాలయం
ABN , First Publish Date - 2022-01-24T04:12:34+05:30 IST
మండల కేంద్రమైన రాచర్లలో గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో అద్దె భవనంలోనే రోజులు వెళ్లదీస్తున్నారు.
వరండాలోనే పఠనం
ఇబ్బంది పడుతున్న పుస్తక ప్రియులు
గ్రంథపాలకుడిని నియమించాలని విజ్ఞప్తి
రాచర్ల, జనవరి 23 : మండల కేంద్రమైన రాచర్లలో గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో అద్దె భవనంలోనే రోజులు వెళ్లదీస్తున్నారు. అదికూడా చిన్నపాటి గదిలో పుస్తకాలు పెట్టుకుని వరండాలో పాఠకులు కూర్చుని చదివే పరిస్థితి ఏర్పడింది. గ్రంథాలయంలో దాదాపు 2వేల పుస్తకాలు ఉండగా, అందులో జనరల్ నాలెడ్జ్, సైన్స్, గ్రూప్స్, నవలలు, కథలు, దినపత్రికలు ఉన్నాయి. ప్రతి రోజూ 50 మంది పాఠకులు గ్రంథాలయానికి వచ్చి చదువుకుని వెళ్తున్నారు. మరికొంత మంది సభ్యత్వం ఉన్న పాఠకులు గ్రంథాలయంలోని పుస్తకాలను ఇళ్లకు తీసుకెళ్లి చదువుకొని తిరిగి అప్పగించి, మరికొన్ని పుస్తకాలను తీసుకెళ్తుంటారు. 7 సంవత్సరాల క్రితం గ్రంథపాలకునిగా పని చేస్తున్న సాయినాయకులు రిటైర్డ్ కావడంతో కింది సిబ్బందే విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రంథాలయానికి సొంత భవనంతోపాటు రెగ్యులర్ గ్రంథపాలకుడిని నియమించాలని పాఠకులు కోరుతున్నారు.