దశలవారీగా ఎల్ఐసీ ఐపీఓ!
ABN , First Publish Date - 2020-09-30T07:02:10+05:30 IST
ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఒకేసారిగా కాకుండా మార్కెట్ పరిస్థితులను బట్టి దశల వారీగా ఎల్ఐసీ షేర్లను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం...
- రంగం సిద్దం చేస్తున్న ప్రభుత్వం
న్యూఢిల్లీ: ఎల్ఐసీ మెగా పబ్లిక్ ఇష్యూకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఒకేసారిగా కాకుండా మార్కెట్ పరిస్థితులను బట్టి దశల వారీగా ఎల్ఐసీ షేర్లను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఎల్ఐసీ ఈక్విటీలో 25 శాతం వాటాను విక్రయించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇది ఎంత లేదన్నా కనీసం రూ.లక్ష కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. అన్నీ అనుకున్నట్టు జరిగితే భారత ఐపీఓ చరిత్రలో ఎల్ఐసీ అతి పెద్ద ఐపీఓ అవుతుందని భావిస్తున్నారు.
చట్ట సవరణ : ఎల్ఐసీ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. ఈ కంపెనీ ఈక్విటీలో ప్రభుత్వ వాటా విక్రయించాలంటే, ఆ చట్టాన్ని సవరించడం తప్పనిసరి. దీంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్పాయి.