మీరులేని జీవనం.. కాబోదు మాకు సులభం
ABN , First Publish Date - 2021-06-21T10:48:59+05:30 IST
కొవిడ్ మహమ్మారి దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ దంపతులను బలితీసుకుంది. మిల్కాసింగ్ శుక్రవారం కన్నుమూయగా, ఆయన భార్య నిర్మలాకౌర్ గత ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే.
తల్లిదండ్రులకు జీవ్ మిల్కా ఉద్వేగభరిత నివాళి
చండీగఢ్: కొవిడ్ మహమ్మారి దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ దంపతులను బలితీసుకుంది. మిల్కాసింగ్ శుక్రవారం కన్నుమూయగా, ఆయన భార్య నిర్మలాకౌర్ గత ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారి కుమారుడు, ప్రముఖ గోల్ఫర్ జీవ్ మిల్కాసింగ్ తల్లిదండ్రులకు ఇన్స్టా ద్వారా ఉద్వేగభరిత నివాళి అర్పించాడు. తమ ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్ చేసిన జీవ్..‘తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధం ఎప్పటికీ చెరిగిపోనిది. ఎంత వయస్సు వచ్చినా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎలా జీవిస్తున్నా వెలకట్టలేని ఆ ప్రేమాభిమానాలలో ఎలాంటి మార్పూ ఉండబోదు. తల్లిదండ్రులుగా కుటుంబానికి మీరే బలం, బలగం. అనంత ప్రేమానురాగాలతో మాలో ప్రతిఒక్కర్నీ మీరు తీర్చిదిద్దారు. అంకిత భావం, ఆత్మవిశ్వాసంతో కఠోరంగా శ్రమిస్తే ఎంత పెద్ద స్వప్నాన్నయినా సాకారం చేసుకోవచ్చంటూ యావద్దేశానికి మీరు స్ఫూర్తిగా నిలిచారు’ అని జీవ్ పేర్కొన్నాడు. ‘మీరులేని జీవనం మాకు అంత సులువు కాదు. దశాబ్దాలుగా ఈ దేశంపై మీ ముద్ర చెరగనిది. ఉత్తమమైన తండ్రి, సోదరుడు, భర్త ఎలా ఉండాలో మీద్వారా నేర్చుకున్నా. మీ పెంపకం దయ, క్షమ, సానుభూతి గుణాలు కలిగిన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దాయి. అమ్మా..నాన్నా..మా గుండెల్లో కొలువైన మిమ్మల్ని వీడి ఉండడం ఆషామాషీకాదు. పైనుంచి మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ దీవిస్తుంటారని ఆశిస్తున్నా’ అని జీవ్మిల్కా పేర్కొన్నాడు.