రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
ABN , First Publish Date - 2021-06-23T05:57:08+05:30 IST
జిల్లాలో రాగల ఐదు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి.చిట్కలాదేవి తెలిపారు.
చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి.చిట్కలాదేవి
అనకాపల్లి, జూన్ 22: జిల్లాలో రాగల ఐదు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి.చిట్కలాదేవి తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్లో మంగళవారం జరిగిన శాస్త్రవేత్తల సమావేశంలో ఆమె మమాట్లలడారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.6 డిగ్రీల నుంచి 39.3 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చన్నారు. గాలిలో తేమ ఉదయం 75 నుంచి 80 శాతం, మధ్యాహ్నం 55 నుండి 62 శాతం ఉంటుందన్నారు. గాలి గంటకు 10 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో వీయవచ్చన్నారు. రాగల వర్షాన్ని వినియోగించుకొని వర్షాధారంగా చెరకు సాగు చేసుకునే రైతులు 87ఏ 298, 2009ఏ 107, 93ఏ 145 వంటి చెరకు రకాలను ఎంపిక చేసుకొని వరుసకు వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు ఉండేలా నాటుకోవాలన్నారు. అలాగే నాటే ముందు మూడు కల్ల ముచ్చులను పది శాతం సున్నం ద్రావణంలో గంటసేపు ఉంచాలని చెప్పారు. ఎకరాకు 125 కిలోల సూపర్పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలని సూచించారు. నాటిన మూడో రోజులోపు ఎకరాకు 1.25 టన్నుల చెరకు చెత్త కప్పితే నేలలో తేమ ఎక్కువ రోజులు ఉంటుందన్నారు. దీనివల్ల పీక పురుగు ఉధృతి తగ్గే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం.బి.జి.ఎస్.కుమారి, డాక్టర్ ఎం.విశాలాక్షి, డాక్టర్ డి.ఆదిలక్ష్మి, డాక్టర్ ఎ.శిరీష, డాక్టర్ వి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.