వంటింట.. గ్యాస్ ‘మంట’!
ABN , First Publish Date - 2020-12-03T05:11:27+05:30 IST
వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. చమురు ఉత్పత్తుల ధరల నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థలకే అప్పగించడంతో ఎప్పటికప్పుడు ధరలు పెంచుకుపోతున్నాయి. ఈసారి అధికంగా ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచి.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను భారం మోపాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్న సమయంలో.. గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.
ఒక్కో సిలిండర్పై రూ.50 పెంపు
జిల్లా వినియోగదారులపై ప్రతినెలా రూ.4 కోట్ల మేర భారం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. చమురు ఉత్పత్తుల ధరల నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థలకే అప్పగించడంతో ఎప్పటికప్పుడు ధరలు పెంచుకుపోతున్నాయి. ఈసారి అధికంగా ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచి.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను భారం మోపాయి. ఇప్పటికే కరోనా దెబ్బకు నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటుతున్న సమయంలో.. గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో గృహవసర వినియోగదారులతో పాటు దీపం, కేంద్రం అందించిన ఉజ్వల్ యోజన పథకం కింద మొత్తం 8 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గత నెలలో జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే 14.50 కిలోల వంట గ్యాస్ సిలిండరు రూ.625 ఉండేది. టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం పరిసరాల్లో సిలిండరు రూ.650 ధర వసూలు చేసేవారు. ఇక నుంచి ఒక్కో సిలిండర్పై రూ.50 అదనంగా వసూలు చేయనున్నారు. తాజా పెంపుతో జిల్లాలోని వినియోగదారులపై ప్రతినెలా అదనంగా రూ.4 కోట్లు మేర భారం పడనుంది. గతంలో చమురు ధరలు పెంచేటపుడు ముందుగా సమాచారం ఉండేది. దీనివల్ల పాత ధరతో గ్యాస్ను అనేకమంది విడిపించుకునే వారు. ఇపుడు చమురు సంస్థలు ఆకస్మికంగా ధరలు పెంచేస్తుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వేళ.. తమపై ఽధరల భారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.