వైసీపీ నేతలకు వరంలా మద్యం వ్యాపారం: టీడీపీ
ABN , First Publish Date - 2021-08-03T14:37:30+05:30 IST
అక్రమ మద్యం వ్యాపారం వైసీపీ నేతలకు..
చిలకలూరిపేట టౌన్: అక్రమ మద్యం వ్యాపారం వైసీపీ నేతలకు వరంలా మారిందని టీడీపీ నాయకులు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ నూతన ఎక్సైజ్ పాలసీ పేరుతో పిచ్చిమద్యం బ్రాండ్లను ప్రోత్సహిస్తూ ఆయా కంపెనీల వద్ద నుంచి నెలకు వందల కోట్ల రూపాయల ముడుపులు అధికారపార్టీ పెద్దలు అందుకుంటున్నారన్నారు. కోరిన బ్రాండ్లు దొరక్క పోవడంతో తెలంగాణ నుంచి విచ్చలవిడిగా అధికారపార్టీ నేతలు మద్యం దిగుమతి చేసుకుని డోర్ డెలివరీలు సైతం అందిస్తున్నారన్నారు. అధికారపార్టీకి చెందిన నాయకుడు, ఇటీవల మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన న్యాయవాది ఏడాది కాలంగా అక్రమ మద్యం వ్యాపారం నిర్వహిస్తూ ఎస్ఈబీ పోలీసు లు అరెస్టు చేశారన్నారు. అధికారపార్టీ నేతల మధ్య తలెత్తిన విభేదాలతో కొందరు అధికారపెద్దల మార్గనిర్ధేశకత్వంలో సదరు న్యా యవాదిని పట్టించారన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, జిల్లాపార్టీ ఉపాధ్యక్షులు షేక్ కరిముల్లా, యార్డు మాజీ చై ర్మన్ ఎస్ఎస్ సుభాని, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ఖాన్, మద్దుమాల రవి, మురకొండ మల్లిబాబు పాల్గొన్నారు.