కర్ణాటక మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-23T05:25:49+05:30 IST
బెంగళూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా మద్యం దిగుమతి చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శుక్రవారం సెబ్ నెల్లూరు-1 పోలీసులు అరెస్ట్ చేసి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి అరెస్టు
నెల్లూరు(క్రైం), అక్టోబరు 22: బెంగళూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా మద్యం దిగుమతి చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శుక్రవారం సెబ్ నెల్లూరు-1 పోలీసులు అరెస్ట్ చేసి కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుని వివరాలను సెబ్ ఇన్స్పెక్టర్ కిశోర్బాబు విలేకర్ల సమావేశంలో తెలిపారు. అనంతసాగరం మండలం కాకువారిపల్లి గ్రామానికి చెందిన ఏ మాధవ్ నెల్లూరు ఏసీ నగర్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇంటి యజమాని తమ్ముడు జే సుధీర్ బెంగళూరులో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వారిద్దరు కలిసి కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించి అధిక ధరకు నెల్లూరులో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ క్రమంలో సెబ్ జేడీ శ్రీలక్ష్మికి అందిన సమాచారంతో ఇన్స్పెక్టర్ కేపీ కిశోర్ సిబ్బందితో కలిసి మాధవ్ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఓసీ విస్కీ 175 క్వార్టర్లు, టెట్రా 90 ఎం.ఎల్ ప్యాకెట్లు 153 స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సుధీర్ బెంగళూరులో ఉన్నాడని త్వరలోనే అరెస్టు చేస్తామని ఇన్స్పెక్టర్ తెలిపారు.