ఎంత పనిచేశావు కరోనా..? పెళ్లిళ్లను వాయిదా వేసుకున్న సెలబ్రెటీ జంటలివే..!
ABN , First Publish Date - 2021-06-01T14:08:55+05:30 IST
ఈ కరోనా మహహ్మారి నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా..? ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుదామా.? ఎప్పుడు కొత్త లైఫ్ ను స్టార్ట్ చేద్దామా..? అన్నంతగా ఆ సెలబ్రెటీ జంటలు ఎదురుచూస్తున్నాయి. ఇంతకీ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్న ఆ జంటలేవో ఓ లుక్కేయండి.
సినీ హీరోయిన్ ప్రణీత సుభాష్ పెళ్లయిపోయింది. ఎంతో కాలం నుంచి తాను ప్రేమిస్తున్న నితిన్ రాజు అనే వ్యాపారవేత్తతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకుంది. కొవిడ్ ఆంక్షల నడుమ అతి కొద్ది మంది బంధువులతో ప్రణీత-నితిన్ రాజు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరిద్దరి పెళ్లి గురించి బాహ్యప్రపంచానికి ముందే తెలియదు. సడన్గా పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులంతా షాకయ్యారు. అయితే, ప్రణీత లాగానే పెళ్లికి కొన్ని సెలబ్రెటీ జంటలు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ వల్ల తమ పెళ్లిళ్లను ఆ జంటలు వాయిదా వేసుకున్నారు. ఈ కరోనా మహహ్మారి నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా..? ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుదామా.? ఎప్పుడు కొత్త లైఫ్ ను స్టార్ట్ చేద్దామా..? అన్నంతగా ఆ సెలబ్రెటీ జంటలు ఎదురుచూస్తున్నాయి. ఇంతకీ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్న ఆ జంటలేవో ఓ లుక్కేయండి.
1. రాహుల్ విద్య-దిశా పార్మర్
టీవీ సెలెబ్రిటీలు రాహుల్ విద్య, దిశా పార్మర్ పెళ్లితో ఈ ఏడాదే ఒక్కటవ్వాలని అనుకున్నారు. కానీ వీరి ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు కుమ్మరించింది. కరోనా కారణంగా వీళ్ల వివాహం వాయిదా పడింది. ఇటీవల మీడియాతో మాట్లాడిన రాహుల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘‘కరోనా కారణంగా మేం ఈ శుభకార్యం నిర్వహించలేకపోయాం. పరిస్థితులు కొంచెం చక్కబడగానే చేయాల్సింది చేస్తాం’’ అని వివరించాడు.
2. వైశాలి టక్కర్, డాక్టర్ అభినందన్ సింగ్ హుందాల్
హిందీలో సూపర్ హిట్ సీరియల్స్లో ఒకటి ససురాల్ సిమర్ కా. ఈ నాటికతో బాగా పేరు తెచ్చుకున్న నటి వైశాలి టక్కర్. ఆమె కూడా ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. డాక్టర్ అభినందన్ సింగ్ హుందాల్తో ఏప్రిల్లో ఆమె నిశ్చితార్థం కూడా జరిగింది. జూన్లో వివాహం చేసుకోవాలని ముహూర్తం పెట్టుకున్నారు. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో వచ్చే ఏడాదికి వివాహాన్ని వాయిదా వేసినట్లు వైశాలి తెలిపారు. ఒక పక్క కరోనాతో ప్రజలు మరణిస్తుంటే తాను మాత్రం పెళ్లి చేసుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆమె తేల్చిచెప్పారు.
3. సయంతని ఘోష్, అనుగ్రహ్ తివారీ
నటి సయంతని ఘోష్, అనుగ్రహ్ తివారీ పెళ్లి గతేడాది జరగాల్సింది. అప్పుడు కరోనా ఉందని ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఇప్పుడు రెండోసారి కూడా వారి వివాహానికి కరోనా అడ్డు తగిలింది. దీంతో తమ పెళ్లిని వాయిదా వేసుకున్న ఈ జంట.. పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో ఇంకా డిసైడ్ చేయలేదట. ‘‘నా పెళ్లి భారీగా చేయాలని లేదు. సింపుల్గా చేసినా కూడా వచ్చిన వాళ్లు సంతోషంగా ఉండాలి. పరిస్థితులు ఇంత బాధాకరంగా ఉన్నప్పుడు ఎవరూ పెళ్లి చేసుకోవాలని అనుకోరు’’ అని ఘోష్ చెప్పారు.
4. శ్రీజిత డీ, మైకేల్ బ్లామ్ పాపే
ఉత్తరన్ టీవీ సీరియల్తో బాగా పాపులర్ అయిన నటి శ్రీజిత డీ. ఆమె బాయ్ఫ్రెండ్ మైకేల్ బ్లామ్ పాపేతో రెండేళ్లుగా డేటింగ్ చేస్తోంది. ఈ ఏడాది మొదట్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా మహహ్మారి విజృంభించడంతో తమ ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. పరిస్థితులు కొంచెం చక్కబడితే పెళ్లిపై నిర్ణయం తీసుకోవడానికి వెయిట్ చేస్తోందీ జంట.
5. టీనా ఫిలిప్, నిఖిల్ శర్మ
టెలివిజన్ సెలెబ్రిటీ జంట గతేడాది ఏప్రిల్లో ఘనంగా వివాహం చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. వీళ్లు కొంతమంది కుటుంబసభ్యులు, బంధువుల మధ్య పెళ్లి చేసుకుందామన్నా కుదరదు. ఎందుకంటే తల్లిదండ్రులు, బంధువులు అందరూ యూఎస్, యూకేల్లోనే ఉన్నారు. వాళ్లెవరూ రాకుండా అయితే పెళ్లి చేసుకోలేరు కదా. కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించడంతో ఈ పెళ్లికి బ్రేకులు పడ్డాయి.
6. విపుల్ రాయ్, మెలిస్ ఆటిసి
యాక్టర్ విపుల్ రాయ్.. అమెరికాకు చెందిన తన ఫియాన్సీ మెలిస్ ఆటిసిని గతేడాదే వివాహం చేసుకోవాల్సింది. గత ఆగస్టులో వీళ్ల పెళ్లికి అన్నీ సిద్ధం అయిపోయాయి. కానీ కరోనా వచ్చి అడ్డుతగిలింది. దీంతో చేసేదేంలేక పెళ్లి వాయిదా వేసుకున్నారు. అన్నీ కుదిరిన ఈ జంట పెళ్లికి కరోనా జలగలా పట్టుకొని ఈ ఏడాది కూడా వదలడం లేదు. దీంతో పరిస్థితులు కుదుటపడే వరకూ వేచి చూసి పెళ్లి ఎప్పుడు చేసుకోవాలో డిసైడ్ అవుదామని వెయిట్ చేస్తోందీ జంట.