సాహితీవేత్త భావశ్రీ కన్నుమూత
ABN , First Publish Date - 2021-12-04T08:08:31+05:30 IST
ప్రముఖ రచయిత, సాహితీవేత్త, పాత్రికేయుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు భావశ్రీ (87) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు.
రాజాం రూరల్, డిసెంబరు 3 : ప్రముఖ రచయిత, సాహితీవేత్త, పాత్రికేయుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు భావశ్రీ (87) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం సంతవురిటి గ్రామానికి చెందిన వాండ్రంకి రామారావు (భావశ్రీ) 1935లో జన్మించారు. 13వ ఏట నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన మరోపక్క రచనావ్యాసాంగాన్ని కొనసాగించారు. కవిత, కథ, నవల, కావ్యం, నాటిక, నాటకం, వ్యాసం... ఇలా అన్నింటా ప్రతిభ చూపారు. పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. సినిమాలకు గీతరచన కూడా చేశారు. ఆకాశవాణిలో 500కి పైగా ప్రసంగాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతులమీదుగా 1987లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.