లాక్డౌన్ సడలింపుతో పశువుల అంగడి కళకళ
ABN , First Publish Date - 2021-06-12T05:47:47+05:30 IST
లాక్డౌన్ సడలింపుతో ప్రతి శుక్రవారం జరిగే రాష్ట్రంలో పేరొందిన హుస్నాబాద్ పశువులు, మేకల అంగడి కళకళలాడింది.
జోరుగా కాడెడ్ల కొనుగోళ్లు
ఎద్దుల జతకు రూ. లక్ష పైనే పలికిన ధర
హుస్నాబాద్, జూన్ 11: లాక్డౌన్ సడలింపుతో ప్రతి శుక్రవారం జరిగే రాష్ట్రంలో పేరొందిన హుస్నాబాద్ పశువులు, మేకల అంగడి కళకళలాడింది. నాలుగు వారాలుగా లాక్డౌన్తో వెలవెలబోయిన అంగడికి శుక్రవారం రైతులు భారీగా తరలివచ్చారు. మేకలు, గొర్లు, పశువుల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులను దృష్టిలో పెట్టుకొని రైతులు కాడెడ్లను కొనుగోలు చేశారు. దీంతో వీటి ధరలు ఆమాంతం పెరిగాయి. నాణ్యమైన జాతి రకం ఎద్దుల జతకు లక్ష రూపాయలకు పైమాటే పలికింది.
లాక్డౌన్ విధించిన మొదటి రెండు వారాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, తరువాత రెండు వారాలు ఒంటి గంట వరకు లాక్డౌన్ సడలింపు ఉండటంతో దూర ప్రాంతాల నుంచి రైతులు అంగడికి రాలేక పోయారు. ప్రస్తుతం ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలింపు సమయం ఉండడంతో రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోళ్లు జరిపారు. అయితే భౌతిక దూరం మాత్రం పాటించకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.