మరీ ఇంత ఘోరమా..? అప్పు తీర్చడం లేదని ముగ్గురు కూతుళ్లను బంధించి..

ABN , First Publish Date - 2021-08-27T15:52:42+05:30 IST

కరోనా కాలంలో ఉన్న ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది ఇబ్బందులు పడిన సందర్భాలు కోకొల్లలు. ఇలా కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి.. తన బావకు ఇచ్చిన అప్పు తీర్చలేకపోయాడు.

మరీ ఇంత ఘోరమా..? అప్పు తీర్చడం లేదని ముగ్గురు కూతుళ్లను బంధించి..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కాలంలో ఉన్న ఉద్యోగాలు కోల్పోయి చాలా మంది ఇబ్బందులు పడిన సందర్భాలు కోకొల్లలు. ఇలా కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక వ్యక్తి.. తన బావకు ఇచ్చిన అప్పు తీర్చలేకపోయాడు. ఎన్నిసార్లు అడిగినా తన అప్పు తీర్చడం లేదని కోపం తెచ్చుకున్న సదరు బావ.. ఒక రోజు కొందరు దుండగులతో అతని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యాభర్తలిద్దరూ ఇంట్లో లేకపోవడంతో.. అతని ముగ్గురు కుమార్తెలను బంధించాడు. ఈ ఘోరమైన ఘటన తమిళనాడులోని తిరువణ్‌మలై జిల్లాలో వెలుగు చూసింది.


స్థానికంగా నివసించే రఘు అనే వ్యక్తి.. తన బావ రాజన్ దగ్గర రూ.2.8 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు తీసుకుని ఏడాది అవుతోంది. మధ్యలో కరోనా కారణంగా రఘు ఉద్యోగం పోయింది. దీంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది. ఇక అప్పు ఎలా తీరుస్తాడు? దీంతో బావకు తన సమస్య చెప్పి, కొంత సమయం కావాలని కోరాడు. కానీ తన అప్పు తీర్చేయాలంటూ రఘు గొడవ చేయడంతో.. ఇంట్లోని కొన్ని సామాన్లు అమ్మేసి మరీ రూ.40వేలు తీర్చాడు. మిగతా అప్పు తీర్చడం రాజన్ వల్ల కాలేదు. వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి. ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.


అప్పు తీర్చాలని రాజన్ ఎంత అడిగినా రఘు తీర్చకపోవడంతో.. రాజన్‌కు విపరీతమైన ఆగ్రహం వచ్చింది. సోమవారం నాడు కొంతమందిని వెంటబెట్టుకుని రఘు ఇంటికి గొడవకు వచ్చాడు. ఆ సమయంలో రఘు దంపతులు ఇంట్లో లేరు. రఘు ముగ్గురు కుమార్తెలతోపాటు పక్కింటి వాళ్ల అమ్మాయి ఆ ఇంట్లో ఆడుకుంటోంది. గొడవ పడటానికి వచ్చిన రాజన్ ఈ నలుగురు ఆడపిల్లలను గదిలో బంధించాడు. తన అప్పు తీర్చాలని రఘుకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ విషయం తెలిసిన రఘు పడుతూ లేస్తూ ఇంటికొచ్చాడు. అదే సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని నలుగురు అమ్మాయిలను విడిపించారు. రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-08-27T15:52:42+05:30 IST