అర్హులైన వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2020-09-25T06:00:57+05:30 IST
ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు
లక్ష్యాలను ఈ నెల 28 లోపు పూర్తి చేయాలి - కలెక్టర్ కె శశాంక
కరీంనగర్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలోని వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ కె శశాంక బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలోని వీధి వ్యాపారుల జీవనోపాధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదివేల రూపాయలు బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడంలో కొంతమంది బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు గమనించామని తెలిపారు. బ్యాంకుల వారీగా పట్ట్టణ ప్రాంత జనాభాలో రుణాలను నిర్దేశించిన ప్రకారం ఐదు శాతం ఈ నెల 28వ తేదీలోగా రుణాలు అందించాలని, లేని పక్షంలో తగు చర్యలు తీసుకుంటామన్నారు.
రుణాల మంజూరులో మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా డీజీఎంలు, ఏజీఎంలు రోజువారి బ్యాంకుల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి. ఎన్ని పరిశీలించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ గల కారణాలను సేకరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, ట్రైనీ కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్, మున్సిపల్ కమిషనర్లు, మెప్మా ఏపీడీ, ఎస్బీ, జీడీఎం ప్రసాద్, జిల్లాలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.