ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం
ABN , First Publish Date - 2022-02-13T15:11:59+05:30 IST
రాష్ట్రంలో నగరపాలక, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికలకు వారం రోజులే మిగిలి ఉండటంతో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడం,
- చిహ్నాలతో ఈవీఎంలు సిద్ధం
- పోలింగ్ బూత్లలో సీసీ కెమెరాలు
- ఓటర్లకు స్లిప్పుల పంపిణీ
చెన్నై: రాష్ట్రంలో నగరపాలక, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికలకు వారం రోజులే మిగిలి ఉండటంతో ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడం, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు బలగాలను నియమించడం, ఆ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, ఓటర్లకు బూత్ స్లిప్పులను పంపిణీ వంటి పనులను చురుగ్గా చేపడుతున్నారు. రాష్ట్రంలో 21 కార్పొరేషన్లకు సంబంధించిన 1374 వార్డు కౌన్సిలర్ల పదవులకు, 138 మునిసిపాలిటీల్లో 3843 వార్డులకు, 490 పట్టణ పంచాయతీల్లో 7621 వార్డు సభ్యుల పదవులకు ఒకే విడతగా ఈ నెల 19న పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమీపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణాధికారులంతా ఈవీఎంల తరలింపు పనులు, బూత్స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి సదుపాయాల కల్పన వంటి పనులను శరవేగంగా చేపడుతున్నారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల నిర్వహణాధికారిగా ఉన్న కమిషనర్ గగన్దీ్ప సింగ్ బేదీ పర్యవేక్షిస్తున్నారు. శనివారం 200 వార్డులకు సంబంధించిన 5794 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు సిద్ధం చేశారు. వారం రోజులుగా ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సిబ్బందికి శిక్షణకార్యక్రమాలు జరిపారు. ఆ తర్వాత వాటిపై పార్టీల అభ్యర్థుల పేర్లు, ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు, వారి చిహ్నాలను అతికించే పనులు జరిగాయి. శనివారం ఈ పనులన్నీ పూర్తికావటంతో ఈవీఎంలను ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
3 వేలమందితో బూత్స్లిప్పుల పంపిణీ
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్లో ఓటర్ల ఇళ్లవద్దే బూత్ స్లిప్పుల పంపిణీ శనివారం ప్రారంభమైంది. కార్పొరేషన్కు చెందిన మూడువేల మంది సిబ్బంది ఈ బూత్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు. మూడు రోజులపాటు వీటిని పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ గగన్దీ్ప సింగ్ బేదీ తెలిపారు. ప్రతి స్లిప్పులోనూ ఓటరు పేరు, ఫొటో, పోలింగ్ కేంద్రం వివరాలున్నాయి. ఒక వేళ బూత్ స్లిప్పు అందకపోతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బంది వాటిని అందజేస్తారని, ఓటర్లు ఇబ్బంది పడకుండా బూత్ స్లిప్పులను అందజేస్తారని గగన్దీ్ప సింగ్ బేదీ తెలిపారు.
6వేలకు పైగా సీసీ కెమెరాలు: నగరంలో కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల వద్ద, ఈవీఎంలను భద్రపరచనున్న గదుల వద్ద 6118 సీసీ కెమెరాల ఏర్పాట్లు శనివారం ప్రారంభమయ్యాయి. నగరంలోని 5794 పోలింగ్ కేంద్రాల వద్ద, ఈవీఎంలను భద్రపరిచే 54 కేంద్రాల వద్ద ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాల్లో దృశ్యాలన్నీ కార్పొరేషన్ ప్రధా న కార్యాలయం, కోయంబేడులోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ల నుంచి ఎన్నికల పర్యవేక్షకులు నిరంతరం పరిశీలిస్తుంటారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సమీపంలోనూ 740 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి కూడా ఎన్నికల అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు.