ఇంటికి తాళం వేస్తే చోరీ జరగాల్సిందే!
ABN , First Publish Date - 2021-02-23T04:36:43+05:30 IST
పట్టణ శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు.
సక్రమంగా వెలగని వీధి దీపాలు
మొక్కుబడిగా పోలీస్ రాత్రి గస్తీ
భయాందోళనలో శివారు ప్రాంత ప్రజలు
కావలి రూరల్, ఫిబ్రవరి 22: పట్టణ శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చెయ్యక పోవటం, ఏర్పాటు చేసినవి సక్రమంగా వెలగకపోవడంతో ఆ ప్రాంతాలు చీకటి మయంగా మారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. రాత్రి సమయాల్లో పోలీస్ గస్తీ కూడా మొక్కుబడిగా మారటంతో దొంగల భయంతో శివారు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకేరోజు పట్టణ పరిధిలోని ముసునూరు ప్రాంత కాలనీల్లో తాళం వేసి ఉన్న 4 ఇళ్లల్లో చోరీలు జరగడాన్ని ఆదివారం సాయంత్రం స్థానికులు గుర్తించి బాధితుల ద్వారా పోలీసులకు సమాచారం అందజేశారు. మర్రి చెట్టు కాలనీ, రాఘవేంద్ర కాలనీల్లో జరిగిన చోరీలే ఇందుకు నిదర్శనం. అయితే ఒకే ప్రాంతంలో ఒకే తరహాలో చోరీలు జరగడం విశేషం. వేలాది రూపాయల పన్నులు చెల్లిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో వీధిలైట్లు కూడా వేయలేదని స్థానికులు వాపోతున్నారు.