మన్యంలో పక్కాగా లాక్డౌన్, కర్ఫ్యూ
ABN , First Publish Date - 2021-05-14T05:13:08+05:30 IST
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీలో ప్రజలు, వర్తకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న లాక్డౌన్, ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పక్కాగా అమలవుతున్నది.
సమయానికి దుకాణాలు బంద్
నిర్మానుష్యంగా రహదారులు
పాడేరు, మే 13: కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఏజెన్సీలో ప్రజలు, వర్తకులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఏర్పరచుకున్న లాక్డౌన్, ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పక్కాగా అమలవుతున్నది. ప్రభుత్వం కర్ఫ్యూ, 144 సెక్షన్ ప్రారంభించక ముందు నుంచే ఏజెన్సీలోని పాడేరు మొదలుకుని అన్ని మండలాల్లోనూ పాక్షిక లాక్డౌన్ను ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు, హోటళ్లు తెరిచేవారు. అలాగే ఏజెన్సీ 11 మండలాల్లో జరిగే 42 వారపు సంతలను పూర్తిగా రద్దు చేశారు. ఈక్రమంలోనే మే ఐదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కర్ఫ్యూ విధించి, 144 సెక్షన్ను అమల్లోకి తీసుకువచ్చింది. మన్యంలోని ప్రజలు మాత్రం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇళ్లకే పరిమితమవుతున్నారు. అలాగే అన్ని రకాల వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేస్తుండడంతో జన సంచారం నిలిచిపోయి రోడ్లు, ప్రధాన కూడళ్లు సైతం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.