కేసుల సంఖ్యపై లాక్ డౌన్ ప్రభావం తక్కువే: ఎయిమ్స్ డైరెక్టర్

ABN , First Publish Date - 2020-06-07T18:42:11+05:30 IST

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇంకా పీక్‌కు(పతాకస్తాయికి) చేరుకోలేదని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు.

కేసుల సంఖ్యపై లాక్ డౌన్ ప్రభావం తక్కువే: ఎయిమ్స్ డైరెక్టర్

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇంకా పీక్‌కు(పతాకస్థాయికి) చేరుకోలేదని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో సమయంలో ఈ స్థాయికి చేరకుంటుందని తెలిపారు.


నిపుణులు అభిప్రాయం ప్రకారం.. వ్యాధి వ్యాప్తిలో భాగంగా రోగుల సంఖ్య ఓకానొక సమయంలో పతాకస్థాయికి(పీక్) చేరుకుని ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే వ్యాధి ఇలా నెమ్మదించేందుకు ప్రభుత్వం పటిష్ట రక్షణ చర్యలు కూడా చేపట్టవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


‘భారత్‌లో కేసుల సంఖ్య ఇంకా పీక్‌కు చేరుకోలేదు. ప్రస్తుతం ఇక్కడ కేసులు పెరుగుతున్నప్పటికీ దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే ఇది అసాధారణమేమీ కాదు. ఈ అంశంలో భారత్‌ను ఇతర ఐరోపా దేశాలతో పోల్చకూడదు. భారత జనాభా అక్కడి రెండు మూడు దేశాలతో సమానం’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉండటాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.


ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సామాజిక వ్యాప్తికి సంబంధించిన భయాలపై కూడా రణదీప్ స్పందించారు. ఢిల్లీ, ముంబై నగరాల్లో ప్రాంతీయ స్థాయిలోనే ఈ పరిస్థితి ఉందని ఆయన స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రభావంపై కూడా వ్యాఖ్యానించిన ఆయన..ఇది కొంత మేర ప్రభావం చూపినప్పటికీ.. కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకోలేదని జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-06-07T18:42:11+05:30 IST