లాక్డౌనే కొంప ముంచింది
ABN , First Publish Date - 2020-06-05T06:10:27+05:30 IST
కొవిడ్-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త రాజీవ్ బజాజ్ తప్పుపట్టారు. కరోనా వైరస్ కంటే లాక్డౌనే భారత ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీసిందన్నారు...
- డిమాండ్ పెంపే సమస్య: రాజీవ్ బజాజ్
న్యూఢిల్లీ: కొవిడ్-19ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను ప్రముఖ పారిశ్రామికవేత్త రాజీవ్ బజాజ్ తప్పుపట్టారు. కరోనా వైరస్ కంటే లాక్డౌనే భారత ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీసిందన్నారు. ఈ కారణంతోనే జీడీపీ వృద్ధి రేటు పడిపోయిందన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఒక సదస్సులో రాహుల్ బజాజ్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. మనకు సారూప్యం ఉన్న ఆసియా దేశాలకు బదులు.. అమెరికా, ఇతర పశ్చిమ దేశాల తరహాలో మన దేశంలో లాక్డౌన్ను అమలు చేయడం ముమ్మాటికీ తప్పన్నారు. దీంతో భారత్ అన్ని విధాలా నష్టపోయిందన్నారు.
మరో ఉద్దీపన కావాలి : ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై బజాజ్ పెదవి విరిచారు. పడిపోయిన డిమాండ్ పెంపే ఇప్పుడు అస లు సమస్య అన్నారు. ఉద్దీపన ప్యాకేజీలో అందుకు ఎలాంటి చర్యలు లేవన్నారు. డిమాండ్ పెంపు కోసం ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమెరికా, జపాన్ దేశాల్లోలా, మన దేశంలోనూ ప్రజలు, కంపెనీల చేతికి మూడింట రెండు వంతుల నగదు చేతికి అందితే తప్ప డిమాండ్ పెరగదని స్పష్టం చేశారు.
పెద్ద ప్రమాదం తప్పింది : అదానీ
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాత్రం ప్రభుత్వ చర్యలను సమర్థించారు. కొవిడ్-19 కట్టడి కోసం విధించిన లాక్డౌన్నూ ఆయన సమర్ధించారు. లేకపోతే దేశంలో నియంత్రించలేని ఉపద్రవం తలెత్తి ఉండేదన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ వార్షిక నివేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధిక వినియో గం ఉన్న దేశాల్లో ఒకటైన భారత్ను ఉత్పత్తి, సేవల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇదో అవకాశం అన్నారు. ఈ సంక్షోభ సమయంలోనూ భారీ వ్యాపార అవకాశా లు పుట్టుకొస్తాయని భావిస్తున్నట్టు అదానీ తెలిపారు.