ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ

ABN , First Publish Date - 2021-05-13T21:07:05+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు.

ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ఆ లేఖలో కోరారు. మరో మూడు వారాల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరినీ పాస్ చేయాలన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ సహా దేశంలోమరో 12 రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షల్ని రద్దుచేశాయన్నారు. పలు మార్లు విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన అన్‌లైన్ సమావేశాల్లో కోవిడ్ భయానికి తోడు పరీక్షల పట్ల ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. కోవిడ్ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.


రాష్ట్రంలో 5వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నప్పుడు గత ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారని, రాష్ట్రంలో ఇప్పుడు 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని లోకేష్ అన్నారు. వేలాది కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవటం ఎంతో ప్రమాదకరమన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భయపడే పరీక్షల నిర్వహణపై సమయాన్ని వృథా చేయొద్దని, పరీక్షల రద్దు నిర్ణయం ప్రకటించి.. విద్యార్థులను పాస్ చెయ్యాలని కోరారు. హైకోర్టు లేదా ప్రతిపక్ష నాయకుల ఆందోళనలతో కాకుండా మానవత్వంతో ఆలోచించి వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించాలని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-13T21:07:05+05:30 IST