సుదీర్ఘ కొవిడ్.. రోగ లక్షణాలు 200పైనే..! కొత్త అధ్యయనంలో వెల్లడి!
ABN , First Publish Date - 2021-07-16T01:26:35+05:30 IST
‘సుదీర్ఘ కొవిడ్’తో బాధపడేవారిలో 200పైగా శారీరక ఇబ్బందులను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
న్యూఢిల్లీ: ‘సుదీర్ఘ కొవిడ్’తో బాధపడేవారిలో 200పైగా శారీరక ఇబ్బందులను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. 56 దేశాల్లోని 3762 రోగులను పరిశీలించిన అనంతరం సుదీర్ఘ కొవిడ్కు సంబంధించి మొత్తం 203 లక్షణాలను గుర్తించారు. ఈ-క్లినికల్ మెడిసిన్ అనే జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. కొవిడ్ బారిన పడ్డ పన్నెండు వారాల తరువాత కూడా బాధితుల్లో శారీరక సమస్యలు కొనసాగడాన్ని వైద్యులు సుదీర్ఘ కొవిడ్(లాంగ్ కొవిడ్)గా అభివర్ణిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇటువంటి వారిలో చూపు మసకబారడం, విరేచనాలు, నీరసం, గుండె వేగం పెరిగినట్టు ఉండటం, మూత్రవిసర్జనపై అదుపు లేకపోవడం వంటి 203 రకాల సమస్యలను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘సుదీర్ఘ కొవిడ్ గురించి వైద్య వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ.. ఓ క్రమపద్ధతిలో వాటిపై అధ్యయనం జరగడం మాత్రం ఇదే తొలిసారి’’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న డా. అథీనా అక్రమామీ వ్యాఖ్యానించారు. యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్లో న్యూరో సైంటిస్ట్గా డా. అథీనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.