సర్వదా కృతజ్ఞతతో ఉండాలి!
ABN , First Publish Date - 2020-03-20T06:08:07+05:30 IST
ఒకసారి ఏసు ప్రభువు జెరూసలేమ్కు ప్రయాణం చేస్తున్నాడు. ఒక గ్రామంలో నుంచి వెళ్తూ ఉండగా, పది మంది వ్యక్తులు ఆయనకు ఎదురయ్యారు. వారందరూ కుష్ట...
ఒకసారి ఏసు ప్రభువు జెరూసలేమ్కు ప్రయాణం చేస్తున్నాడు. ఒక గ్రామంలో నుంచి వెళ్తూ ఉండగా, పది మంది వ్యక్తులు ఆయనకు ఎదురయ్యారు. వారందరూ కుష్టు వ్యాధిగ్రస్తులు. వారు ఏసు ప్రభువు సమీపానికి వచ్చి నిలబడి, గట్టిగా అరిచారు, ‘‘జీసస్! ఓ బోధకుడా! మా మీద దయచూపు’’ అని వారిని ఏసు చూసి, ‘‘వెళ్ళండి. మీ మతాధికారులకు వెళ్ళి కనబడండి’’ అన్నాడు.
ఆ వ్యక్తులకు కుష్టు వ్యాధి లేదని నిర్ధారించవలసింది ఆ మతాధికారులే. కాబట్టి వారు బయలుదేరారు. మార్గమధ్యంలోనే వారి వ్యాధి నయమైపోయింది.ఆ రోగులలో ఒక వ్యక్తి తనకు స్వస్థత లభించిన సంగతి గ్రహించాడు. ఆ పదిమందిలో తొమ్మిదిమంది యూదులు కాగా అతను ఒక్కడే సమరయుడు. అతను పరుగుపరుగున వెనక్కి వచ్చి, ఏసును కలుసుకొని ధన్యవాదాలు చెప్పాడు.
‘‘మొత్తం పదిమందికీ నయం అయింది కదా! ఈ బయటి వ్యక్తి తప్ప మిగిలిన వారెవరూ వెనక్కి రాలేదు, దేవుణ్ణి ప్రార్థించలేదు. మిగిలిన వారు ఏరీ?’’ అని ఏసు ప్రశ్నించాడు. తరువాత ఆ వ్యక్తిని చూస్తూ లేచి ‘‘వెళ్ళు. నీ విశ్వాసం నీకు స్వస్థత చేకూర్చింది’’ అని అన్నాడు.
మనలోనూ చాలామంది ఆ తొమ్మిదిమంది మాదిరిగానే ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుణ్ణి ఎన్నో కోరుకుంటాం. వాటిని దేవుడు నెరవేర్చినప్పుడు ఆయనకు కృతజ్ఞత చెప్పడం, ప్రార్థన చేయడం కనీసం చేయాల్సిన విధి అని మరచిపోతాం. ఎల్లవేళలా దైవం మనను ఒక కంట కనిపెట్టి, కాపాడుతూ ఉంటాడు. అందుకే ఆయనకు నిరంతరం కృతజ్ఞులమై ఉండాలి. సంతోషంలో ఉన్నా, కష్టంలో ఉన్నా ఎప్పుడూ ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి.