శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు!

ABN , First Publish Date - 2020-03-09T10:22:38+05:30 IST

లోకంలో చిన్న చిన్న పనులు చేసే వారిని ఆవిష్కర్తలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ కోవలో చూస్తే.. శివుడు ఎన్నో విషయాలను ఈ

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు!

లోకంలో చిన్న చిన్న పనులు చేసే వారిని ఆవిష్కర్తలుగా మనం పిలుస్తూ ఉంటాం. ఆ కోవలో చూస్తే.. శివుడు ఎన్నో విషయాలను ఈ ప్రపంచానికి అందించిన ఆద్యంతరహితుడు. ‘‘ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్‌’’ ..అని చెప్పింది ఈశావాస్యోపనిషత్‌! ఈ జగత్తులో సర్వం ఈశ్వరునిచే ఆవృతమై ఉందని ఉపనిషత్‌ వాక్యానికి అర్థం. సమస్త చరాచర ప్రపంచమూ ఈశ్వరమయం. మానవుల్లోని సృజనశక్తికి, భావవ్యక్తీకరణకు ఆధారం భాష. అలాంటి భారతీయ భాషలకు మూలమైన 14 మహేశ్వర సూత్రాలు పరమశివుడు తన డమరు నాదం నుండి సృష్టించాడు. శివపార్వతుల కల్యాణ సమయంలో హిమవంతుడు.. శివుడి ప్రవర అడిగినప్పుడు ‘నాదం శివమయం’ అని సాక్షాత్తూ నారదుడు హిమవంతుడికి చెప్పాడు.


వర్ణ సమామ్నాయం అందించిన శివుడికి మానవులు రుణపడి ఉన్నారు. అందుకు కృతజ్ఞతగానే అక్షరాభ్యాసం నాడు మనం మన పిల్లలతో.. ‘‘ఓం నమఃశివాయ సిద్ధం నమః’’ అని మొదటగా రాయిస్తూ ఉంటాం. అలాగే యోగవిద్యను మొదట పార్వతీదేవికి బోధించి.. స్త్రీలకు బ్రహ్మవిద్యోపదేశానికి మార్గదర్శి అయ్యాడు. తంత్రాలను సంస్కరించి అందులోని రహస్యాలను జగత్తుకు అందించాడు.


ప్రపంచంలోని సంగీత విద్యకంతా మూలం సప్తస్వరాలు. అందులోని షడ్జమం(నెమలి) రిషభం (ఎద్దు) గాంధారం (మేక) మధ్యమం (గుర్రం) పంచమం (కోకిల) దైవతం (కంచరగాడిద) నిషాదం (ఏనుగు).. ఈ ఏడింటి ధ్వనుల స్వభావంతో సంగీతవిద్యను శివుడు ఆవిష్కరించాడు. ‘శివ తాండవ’ంతో జగత్తుకు ‘నృత్యవిద్య’ను అందించాడు. దైవత్వానికి, ఆధ్యాత్మికతకు నిరాడంబర జీవనమే ప్రాతిపదిక అని ప్రపంచానికి తెలిపేందుకు తాను అలాగే జీవించి చూపించాడు. పార్వతికి సగభాగం ఇచ్చి, గంగను తలపై మోసి స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో  నిరూపించాడు. సమాజంలో భేదాలను రూపుమాపేందుకు శివతత్వం ప్రతిపాదించాడు. ‘‘ఆత్మగోత్రం పరిత్యజ్య శివగోత్రం పవిశతు’’ స్వాభిమానం కలిగించే గోత్రాలను వదిలిపెట్టి శివగోత్రం స్వీకరించండని ప్రబోధించాడు. శ


వాలను ముట్టుకొని శరీరధర్మ విజ్ఞానం తెలిపేందుకే తంత్ర విద్య ప్రవేశపెట్టాడు. గుణహీనుడని, నిర్గుణుడని నిందించిన దక్ష ప్రజాపతి మాటలు తిట్లుగా భావించకుండా ‘లింగ’ రూపం ధరించి నిర్గుణ స్వభావాన్ని లోకానికి అందించాడు. ఆ లింగంపై పంచామృతాలతో పాటు ఏది పోసినా ఏవీ నిలబడకుండా చేసి తన దగ్గర ఏదీ ఉంచుకోననే సందేశం అందించాడు. సగుణ నిర్గుణతత్వానికి ‘శివలింగం’ ప్రతీక అయితే, సంపూర్ణ గురుస్వరూపానికి దక్షిణామూర్తి నిదర్శనం. ఆ స్వామి ముఖం నుండే సనాతనమైన అచలం వ్యక్తమైంది. అత్యద్భుతమైన మోక్ష విద్యను అందించిన దక్షిణామూర్తి ఆది గురువయ్యాడు.


డా. పి. భాస్కరయోగి

Updated Date - 2020-03-09T10:22:38+05:30 IST