లారీ ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-07T05:23:34+05:30 IST

అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం వద్ద సోమవారం సాయంత్రం లారీ ఢీకొని బిక్కవోలు మండలం కాపవరానికి చెందిన గొల్లపల్లి సూర్యప్రకాష్‌(33) మృతి చెందగా, తలారి అరుణ తీవ్రంగా గాయపడింది.

లారీ ఢీకొని వ్యక్తి మృతి

మృతదేహంతో ఆందోళన
అనపర్తి, డిసెంబరు 6: అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం వద్ద సోమవారం సాయంత్రం లారీ ఢీకొని బిక్కవోలు మండలం కాపవరానికి చెందిన గొల్లపల్లి సూర్యప్రకాష్‌(33) మృతి చెందగా, తలారి అరుణ తీవ్రంగా గాయపడింది. ప్రకాష్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కెనాల్‌ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు వివరాల ప్రకారం.. సూర్యప్రకాష్‌ అనపర్తిలోని ఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ షాపులో పనిచేస్తున్నాడు. సోమవారం సాయత్రం కాపవరం నుంచి అనపర్తి వస్తుండగా అదే గ్రామానికి చెందిన అరుణ లిప్టు అడిగింది. వీరి బైక్‌ కెనాల్‌ రోడ్డులోని వడ్లా సుబ్బమ్మ నుయ్యి సమీపానికి వచ్చే సరికి ఎదురుగా బిక్కవోలు వైపు వెళుతున్న లారీ ఢీకొంది. సూర్యప్రకాష్‌ అక్కడికక్కడే మృతి చెందగా అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ మద్యం తాగి మితిమీరిన వేగంతో లారీ నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని సూర్యప్రకాష్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటనా స్థలంలోనే మృతదేహంతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు, స్కూలు విద్యార్థులు పలు ఇబ్బందులు పడ్డారు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు చర్చలు జరుపుతున్నారు. పరిహారం చెల్లించే వరకు ఆందోళన విరమించేది లేదని బంధువులు ఆందోళన కొనసాగించారు.

Updated Date - 2021-12-07T05:23:34+05:30 IST