నూతన విద్యావిధానంతో పేద విద్యార్థులకు నష్టం
ABN , First Publish Date - 2021-10-25T05:22:45+05:30 IST
నూతన విద్యావిధానం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలహీనపడి పేదలు విద్యకు దూరం అవుతారని మండలి ప్రాటెం స్పీకర్ బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.
మండలి ప్రాటెం స్పీకర్ బాలసుబ్రమణ్యం
కడప(ఎడ్యుకేషన), అక్టోబరు 24 : నూతన విద్యావిధానం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ విద్యారంగం బలహీనపడి పేదలు విద్యకు దూరం అవుతారని మండలి ప్రాటెం స్పీకర్ బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యూటీఎఫ్ భవనంలో ఆదివారం విద్యారంగం.. మన కర్తవ్యం అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తోందని, దీని ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులు మిగులుతాయని చెప్పారు. ఇలా అయితే నాణ్యమైన విద్య ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించారు. ఒకవైపు కరోనా కారణంగా పిల్లలు విద్యకు దూరమైతే మరోవైపు తరగతుల విభజన కారణంగా మరింత దూరమవుతారని తెలిపారు. విద్యారంగం బలహీనపడి పేద విద్యార్థులకు దూరమయ్యే ఈ సందర్భంలో ఉపాధ్యాయులు తమ సామాజిక బాధ్యతగా విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంగ్లేయుల కాలం నుంచి లక్షలాది మందికి విద్యను అందించిన ఎయిడెడ్ విద్యాసంస్థలను మూసివేసే చర్యలు అన్యాయమన్నారు. పాఠశాలల్లో యాప్ల నిర్వహణ బోధనకు ఆటంకంగా ఉందని, యాప్లను రద్దు చేయమంటే మరిన్ని యాప్లను తీసుకుని రావడం ద్వారా విద్యావ్యవస్థ నాశనమవుతుందని తెలిపారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు వంటి న్యాయమైన డిమాండ్ల సాధనకు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఉపాధ్యాయులు చైతన్యంతో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీద్, జిల్లా సహాధ్యక్షుడు రూతు ఆరోగ్య మేరి, జిల్లా కోశాధికారి మస్తానయ్య, జిల్లా కార్యదర్శులు మహే్షబాబు, దావుద్దీన, రవికుమార్, సీపీఎస్ కన్వీనర్ మురళి, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకా్షరెడ్డి, వివిధ మండలాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.