భారీగా అనుమానితులు
ABN , First Publish Date - 2022-01-18T05:11:32+05:30 IST
కొవిడ్ టెస్టులు చేయించుకోవడానికి వచ్చే అనుమానితుల సంఖ్య సోమవారం ఒక్కసారిగా పెరిగింది. ఆదివారంతో పెద్ద పండుగ హడావుడి ముగియడంతో లక్షణాలున్న అనుమానితులంతా టెస్టులకు క్యూ కడుతున్నారు.
- రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ టెస్టులు
- ఒక్కరోజే 150 మందికి పరీక్షలు.. వైద్యవర్గాల్లో ఆందోళన
రాజమహేంద్రవరం అర్బన్, జనవరి 17: కొవిడ్ టెస్టులు చేయించుకోవడానికి వచ్చే అనుమానితుల సంఖ్య సోమవారం ఒక్కసారిగా పెరిగింది. ఆదివారంతో పెద్ద పండుగ హడావుడి ముగియడంతో లక్షణాలున్న అనుమానితులంతా టెస్టులకు క్యూ కడుతున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో టెస్టులకు వచ్చేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ టెస్టుల కేంద్రానికి అనుమానిత లక్షణాలున్నవారు అధిక సంఖ్యలో వచ్చారు. వీరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలతో స్వాబ్ సేకరించి కాకినాడలోని ల్యాబ్కు పంపించారు. సుమారు 150 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారని సమాచారం. రిపోర్టులు రావడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. ఎంతమందికి పాజిటివ్ అనేది తేలుతుంది. సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత ఇంత భారీ స్థాయిలో అనుమానిత లక్షణాలున్నవారికి కొవిడ్ పరీక్షలు జరగడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. కాగా, అనుమానిత లక్షణాలతో పరీక్షలు చేయించుకుంటున్నవారి సంఖ్య కొద్దిరోజులుగా నామమాత్రంగానే ఉంటోంది. రోజుకు 15నుంచి 20 మంది వచ్చేవారు. వీరికి టెస్టులు చేస్తే నలుగురు, ఐదుగురికి పాజిటివ్ వచ్చేది. ప్రస్తుతం అనుమానిత లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ వార్డుల్లో 25 మంది వరకూ బాధితులు చికిత్స పొందుతున్నారు. సంక్రాంతి తర్వాత కొవిడ్ అనుమానితుల సంఖ్యతోపాటు కేసులు భారీగా పెరుగుతాయని ఇప్పటికే వైద్యవర్గాలు అంచనాతో ఉన్నాయి. దాన్ని నిజం చేస్తూ ఒక్కరోజే 150 మందికి టెస్టులకు రావడంతో వైద్యవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అప్రమత్తంగా ఉండాలి: డీసీహెచ్ఎస్ రమేష్కిషోర్
సంక్రాంతి పండుగ తర్వాత కొవిడ్ కేసులు పెరుగుతాయని ఎప్పటి నుంచో ఆందోళన ఉంది. ప్రస్తుతం పెరుగుతున్న అనుమానితుల సంఖ్యను చూస్తే అది నిజమనిపిస్తోందని జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్ టి.రమేష్కిషోర్ అన్నారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ వ్యాప్తిని నిరోధించలేకపోయినా దాన్నుంచి కాపాడుకునే రక్షణ చర్యలు అందరూ తీసుకోవాలని, ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొవిడ్ను ఎదుర్కొనడానికి వైద్యయంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉన్నామని, బొమ్మూరులో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.