జోరుగా కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2022-01-18T04:36:00+05:30 IST
కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం జలుబు, దగ్గు ఉన్నా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవడానికి బారులు తీరుతున్నారు.
ఎన్ఏడీ జంక్షన్, జనవరి 17: కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏమాత్రం జలుబు, దగ్గు ఉన్నా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. జీవీఎంసీ 90వ వార్డు బుచ్చిరాజుపాలెం మ్యాక్ సెంటర్కు రోజూ అధిక సంఖ్యలో జనం వస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేస్తున్నట్టు డాక్టర్ తేజస్విరెడ్డి తెలిపారు. పండగకు ముందు 60 మందికి పరీక్షలు చేయగా 25 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. సోమవారం 92 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశామని, రిపోర్టులు రావలసి ఉందన్నారు. పరీక్షలు చేయించుకున్నవారు రిపోర్టులు వచ్చే వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని తెలిపారు.