ప్రేమ.. పెళ్లి.. దగా!
ABN , First Publish Date - 2021-06-21T06:50:15+05:30 IST
ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు..
యువతిని ప్రేమించి.. పెళ్లి చేసుకొని మోసగించిన అటవీ శాఖ ఉద్యోగి
ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించిన యువతి
పరారీలో ఉన్న ప్రబుద్ధుడు
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించిన పోలీసులు
సుభాష్నగర్: ప్రేమించాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత మాయమాటలు చెప్పి.. ఎవరికీ తెలియకుండా ఏడాది పాటు కలిసి జీవించాడు.. ఇప్పుడు ఏమి తెలియనట్టు వదలించుకునే ప్రయత్నం చేయడంతో.. మనస్తాపానికి గురైన యువతి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన కృష్ణగీత్.. ఫారెస్ట్ ఆఫీసులో సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన యువతితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే, సంవత్సరం క్రితం ఆ యువతిని రహస్యంగా పెళ్లి చే సుకున్న కృష్ణగీత్.. తమ తమ ఇంట్లో విషయం ఎవ రికీ తెలియకుండా ఇద్దరూ జాగ్రత్త పడ్డారు.
అయితే నెల క్రితం సదరు యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో విషయాన్ని కృష్ణగీత్కు చెప్పింది. దీంతో మొదటగా ఇంట్లో పెద్దలు చూసిన పెళ్లి చేసుకోవాలని, తర్వాత తాను వచ్చి తీసుకెళ్తానని నమ్మించాడు. నమ్మిన యువతి నెల రోజుల క్రితం మరో పెళ్లి చేసుకుని తర్వాత కృష్ణగీత్ వద్దకు రాగా.. ఆమెను తీసుకెళ్లి వేరే ఇంట్లో కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లగా.. అసలు వ్యవహారం బయట పడింది. ఆ యువతికి సంవత్సరం క్రితమే కృష్ణగీత్తో పెళ్లి జరిగినట్టు తెలుసుకొని షాక్కు గురయ్యారు. చివరకు కృష్ణగీత్ ఇంట్లోనే వదిలిపెట్టి వచ్చారు. అయితే, కృష్ణగీత్తో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం యువతిని తమ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురి చేస్తుండడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఫినాయిల్ తాగింది. వెంటనే ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా.. కృష్ణగీత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విషయమై నాలుగో టౌన్ ఎస్సై సందీప్ను వివరణ కోరగా.. ఈ ఘటనపై యువతి ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.