ప్రేమ వివాహం జరిపించిన పాపానికి...

ABN , First Publish Date - 2020-07-04T14:53:52+05:30 IST

ప్రేమ వివాహం జరిపించిన యువకుడి తల్లి, బంధువును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయగా, మరో ఇరువురికి గాయాలయ్యాయి. తూత్తుకుడి జిల్లా ఏరల్

ప్రేమ వివాహం జరిపించిన పాపానికి...

చెన్నై: ప్రేమ వివాహం జరిపించిన యువకుడి తల్లి, బంధువును గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయగా, మరో ఇరువురికి గాయాలయ్యాయి. తూత్తుకుడి జిల్లా ఏరల్‌ సమీపం పెరుమాళ్‌ ఆలయ వీధికి చెందిన రైతు లక్ష్మణన్‌, ముత్తుపేచ్చి దంపతులకు కుమారుడు విఘ్నేష్‌రాజా పది రోజుల క్రితం పోట్టల్‌ గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గురువారం సాయంత్రం ఆయన తన బంధువు అరుణ్‌తో కలసి శివగెనై బస్టాండ్‌లో నిల్చుని ఉండగా, నలుగురు గుర్తు తెలియని కత్తులతో వచ్చిన వారిపై దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. దుండగుల నుంచి తప్పించుకునేందుకు వారు రక్తం కారుతున్నా లెక్కచేయకుండా ఇంటికి పరుగెత్తారు. వీరిని చూసి దిగ్ర్భాంతి చెందిన విఘ్నేష్‌రాజా, తల్లిదండ్రులు వారిని శ్రీవైకుంఠం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని వెతుక్కుంటూ వచ్చిన ఆ దుండగులు ఇంట్లో ఉన్న లక్ష్మణన్‌, ముత్తుపేచ్చిపై తీవ్రంగా దాడి చేసి పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన ముత్తుపేచ్చి సంఘటనా స్థలంలోనే మృతిచెందింది. చుట్టుపక్కల వారు లక్ష్మణన్‌ను శ్రీ వైకుంఠం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ్‌ మృతిచెందగా, తండ్రీ, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏరల్‌ పోలీసులు, ప్రేమ వివాహమే ఈ ఘటనకు కారణమా? మరేదైనా ఉందా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.

Updated Date - 2020-07-04T14:53:52+05:30 IST