ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి హత్య
ABN , First Publish Date - 2021-12-10T16:01:13+05:30 IST
తూత్తుక్కుడి జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని రాళ్ళ క్వారీలో విసిరేశారు. గురువారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఈ జిల్లాలోని
- క్వారీలో మృతదేహం లభ్యం
అడయార్(చెన్నై): తూత్తుక్కుడి జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని రాళ్ళ క్వారీలో విసిరేశారు. గురువారం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఈ జిల్లాలోని విళాత్తికులం ప్రాంతానికి చెందిన అరవింద్ (25) అనే యువకుడు తెన్కాశిలో ఒక కంపెనీలో పనిచేస్తూ వచ్చాడు. ఈనెల 4వ తేదీన తన గది నుంచి బయటకు వెళ్ళిన అరవింద్ ఆ తర్వాత రూమ్కు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తెన్కాశి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా అరవింద్ ఫోన్ను పరిశీలించగా, మణికంఠన్, సీతారామన్ అనే వారితో అధికంగా మాట్లాడినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కీళపులియూర్కు చెందిన పొన్నరసు (22) అనే వ్యక్తి పులియూర్ గ్రామ వీఏవో వద్దకు వెళ్ళి ఒక వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని రాళ్ళ క్వారీలో పడేసినట్టు చెప్పాడు. ఈ కేసులో మణికంఠన్ (30), సీతారామన్ (28), అరుణాచలం (25), తంబిరామన్ (22) అనే వారికి కూడా సంబంధం ఉందని చెప్పాడు. వీఏవో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, విళాత్తికులం ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ అనే వ్యక్తి కుమార్తె మాలాను అరవింద్ ప్రేమించి పెళ్ళిచేసుకున్నట్టు తేలింది. ఈ కారణంగానే హత్యకు గురైనట్టు తెలిసింది.