ప్రేమించి మోసం చేశాడు
ABN , First Publish Date - 2021-10-22T07:42:43+05:30 IST
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుమారుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడుగు తుంటే బెదిరిస్తున్నారని పేర్కొంది.
- పెళ్లి చేసుకుంటానని ముఖం చాటేశాడు
- వైరా మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై యువతి ఫిర్యాదు
కూకట్పల్లి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ కుమారుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకోమని అడుగు తుంటే బెదిరిస్తున్నారని పేర్కొంది. దీంతో వైరా మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై కూకట్పల్లి పోలీ్సస్టేషన్లో కేసు నమోదైంది. ఆ యువతి తెలిపిన వివరాల ప్రకారం.. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుమారుడు మృగేందర్లాల్ (30) ప్రస్తుతం తమిళనాడులోని మదురైలో ట్రైనీ ఐఏఎ్సగా విధులు నిర్వహిస్తున్నారు. ఆరెండేళ్ల క్రితం ఆయనకు మూసాపేటలో నివాసముండే ఓ యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఇద్దరూ బంధువులమంటూ మృగేందర్ చెప్పడంతో వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఆ యువతిని పెళ్లి చేసుకొంటున్నానని స్నేహితుల సమక్షంలో పలుమార్లు మృగేందర్ అన్నారు. 2019 డిసెంబరు25న ఆయన హైదరాబాద్కు వచ్చారు. సదరు యువతిని విందు కోసం బయటకు తీసుకెళ్లారు. అనంతరం సర్దార్ వల్లభాయ్పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో తన గదికి తీసుకెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. కోపంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మృగేందర్ కొద్దిసేపటికే ఆమెకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారు. తర్వాత యువతి మృగేందర్కు ఫోన్చేసి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అప్పటి నుంచి మృగేందర్ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. విసిగిపోయిన బాధితురాలు.. ఆయనపై కేసు పెట్టడానికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న మృగేందర్ తండ్రి, వైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్.. తన కొడుకుపై ఫిర్యాదు చేయకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తానని బాధితురాలికి చెప్పారు. ఆమె తిరస్కరించడంతో మృగేందర్ ఈ ఏడాది జూలై 31న ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఫోన్ను బలవంతంగా లాక్కొని అందులో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను తొలగించి బెదిరించారు. దీంతో బాధితురాలు గత నెల 27న కూకట్పల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృగేందర్, ఆయన తండ్రి మదన్లాల్పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.