లవ్లీనా గ్లౌజులు రూ. 1.92 కోట్లు!
ABN , First Publish Date - 2021-09-18T07:44:23+05:30 IST
టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు.
ఒలింపిక్ అథ్లెట్ల క్రీడా వస్తువుల ఈ-వేలం షురూ
‘నమామి గంగే’ కోసం విరాళాల వినియోగం
సింధు రాకెట్ రూ. 90 లక్షలు..!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్లో పాల్గొన్న అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగా ఈవెంట్లో పతకాలు సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్ స్టార్ సింధుతోపాటు మరో 13 మంది ప్లేయర్లు.. స్వచ్ఛంద కార్యక్రమాల విరాళాల సేకరణ కోసం ఆటోగ్రాఫ్ చేసిన తమతమ ఆట వస్తువులు, జెర్సీలను మోదీకి బహుమతిగా ఇచ్చారు. శుక్రవారం మోదీ జన్మదినం సందర్భంగా వీటిని ఆన్లైన్లో వేలానికి ఉంచారు. వచ్చే నెల 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు బిడ్డింగ్లో పాల్గొనవచ్చు. వీటి అమ్మకం ద్వారా రూ. 10 కోట్లకు పైగానే ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తాన్ని గంగా నది పరిశుభ్రతకు నిర్దేశించిన ప్రాజెక్ట్ ‘నమామి గంగే’ కోసం వినియోగించనున్నారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా జావెలిన్ కనీస బిడ్డింగ్ ధర రూ. కోటిగా నిర్ధారించారు. బాక్సింగ్లో కాంస్యం సాధించిన లవ్లీనా బొర్గొహైన్ గ్లౌజ్లు కనీస ధర రూ. 80 లక్షలు కాగా.. రూ. 1.92 కోట్లకు చేరుకోవటం విశేషం.
ఇక బ్యాడ్మింటన్లో కాంస్యం నెగ్గిన పీవీ సింధు రాకెట్, బ్యాడ్మింటన్ బ్యాగ్ ధర రూ. 90 లక్షలు పలుకుతోంది. పారాలింపిక్స్లో స్వర్ణం సాధించిన సుమీత్ అంటిల్ జావెలిన్, మహిళల హాకీ టీమ్ కెప్టెన్ రాణీ రాంపాల్ హాకీ స్టిక్ ధరలు రూ. కోటికి పైకి చేరుకోగా.. ఫెన్సింగ్లో ప్రాతినిథ్యం వహించిన భవానీ దేవి కత్తి (ఫెన్స్) రూ. 60 లక్షలుగా ఉంది.