అనుమానంతో ఉరివేసి.. గొయ్యిలో పాతిపెట్టి...

ABN , First Publish Date - 2021-04-23T19:43:37+05:30 IST

ప్రియురాలు మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానించిన

అనుమానంతో ఉరివేసి.. గొయ్యిలో పాతిపెట్టి...

  • ప్రియురాలిని హత్యచేసిన ప్రియుడు
  • మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే 
  • గతనెల 31న మహిళ మిస్సింగ్‌ కేసులో వీడిన మిస్టరీ 

హైదరాబాద్/ఆమనగల్లు : ప్రియురాలు మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెకు బాగా మద్యం తాగించి.. చీరతో ఉరివేసి చంపేశాడు. పైగా నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలో మల్లన్న గుట్టపై ఈ దారుణం వెలుగుచూసింది. షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ ఆమనగల్లు పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. కేశంపేట మండల కేంద్రానికి చెందిన నారా అమృత(25)కు పదేళ్ల క్రితం పెళ్లయింది. ఆరేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకొని కేశంపేటలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. పోలెపల్లికి చెందిన గంగాపురం శంకర్‌తో మూడేళ్లక్రితం ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అమృత, మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన శంకర్‌, ఆమె హత్యకు పథకం పన్నాడు. 


మార్చి 31న ఆమెకు కేశంపేటలో మద్యం తాగించి మల్లన్న గుట్ట వద్దకు తీసుకొచ్చాడు. తన స్నేహితుడైన విఠాయిపల్లి తండాకు చెందిన ఇస్లావత్‌ శంకర్‌ సాయంతో అమృతను ఆమె చీరతోనే ఉరివేసి హతమార్చాడు. గుట్ట కింద భాగంలో అటవీ సంరక్షణ కోసం తీసిన గోతిలో మృతదేహాన్ని పూడ్చి వేశాడు. అదేరోజు అమృత కనిపించడం లేదంటూ ఆమె సోదరుడు నర్సింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె సెల్‌ఫోన్‌ కాల్‌డాటా ఆధారంగా గంగాపురం శంకరే నిందితుడు అని పోలీసులు తేల్చారు. గురువారం ఘటన స్థలానికి నిందితుడిని తీసుకెళ్లి అమృత మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం జరిపించారు. నిందితుడు శంకర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ కుషాల్కర్‌ తెలిపారు.

Updated Date - 2021-04-23T19:43:37+05:30 IST