మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమ్మె
ABN , First Publish Date - 2021-12-07T06:38:16+05:30 IST
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సోమవారం సమ్మెబాట పట్టారు. జిల్లాలో 499 ప్రభుత్వ పాఠశాలల్లో 38,800 మంది విద్యార్థులకు మధ్యాహ్నా భోజనాన్ని అందిస్తున్నారు
సిరిసిల్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సోమవారం సమ్మెబాట పట్టారు. జిల్లాలో 499 ప్రభుత్వ పాఠశాలల్లో 38,800 మంది విద్యార్థులకు మధ్యాహ్నా భోజనాన్ని అందిస్తున్నారు. నిర్వాహకుల సమ్మెతో సగం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోగా విద్యార్థులు ఇళ్ల నుంచి బాక్స్లు తెచ్చుకున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు వంటలు చేశారు. మరికొన్ని పాఠశాలల్లో ఇతర వ్యక్తుల ద్వారా వంటలు చేయించి విద్యార్థులకు భోజనం వడ్డించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మూడు నెలలుగా రూ.2.33 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అప్పులు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనాన్ని అందించలేమని నిర్వాహకులు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో సమ్మెలోకి దిగారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. మధ్యాహ్నభోజన బిల్లులు చెల్లించాలని, కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్, కోడిగుడ్లు సరఫరా చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన వంట చార్జీలు పెంచాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇస్తున్నట్లుగా మధ్యాహ్న భోజనానికి కూడా కిరాణా సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.