ఏ తల్లి కన్నబిడ్డో..!

ABN , First Publish Date - 2020-08-13T14:02:13+05:30 IST

ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు గానీ..ఈదురు గాలులకు, దోమలదాడికి..

ఏ తల్లి కన్నబిడ్డో..!

రోడ్డుపక్కన పడేసివెళ్లిన తల్లి

జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతున్న పసికందు


మదనపల్లె(చిత్తూరు): ఏ తల్లి కన్నబిడ్డో తెలియదు గానీ..ఈదురు గాలులకు, దోమలదాడికి తట్టుకోలేక గుక్కపట్టి ఏడుస్తున్న పసికందును స్థానికులు గుర్తించి అక్కున చేర్చుకున్న ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె సమీపంలో నీళ్లట్యాంక్‌ పక్కన మంగళవారం రాత్రి ఎవరో అప్పుడే జన్మించిన ఆడబిడ్డను తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు. బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుండడాన్ని బుధవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి 108 సిబ్బందికి సమాచారం అందించారు.


వారు వచ్చి బిడ్డను జిల్లా వైద్యశాలకు తరలించారు. చిన్నపిల్లల వైద్యులు మధుసూదనాచారి బిడ్డను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పారు. తాలూకా పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని బిడ్డ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. సీడీపీవో సుజాత మాట్లాడుతూ బిడ్డ కోలుకున్నాక..చిత్తూరు శిశువిహార్‌కు తరలిస్తామన్నారు. బిడ్డను పడేసివెళ్లిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.  


Updated Date - 2020-08-13T14:02:13+05:30 IST