జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలెందుకు చేశారు?

ABN , First Publish Date - 2021-08-03T08:45:56+05:30 IST

‘‘హైకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు పోస్టు చేశారు? అలా చేయడం తప్పని తేలియదా

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలెందుకు చేశారు?

వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి దేవేందర్‌ రెడ్డికి సీబీఐ ప్రశ్నలు

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ‘‘హైకోర్టు జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు పోస్టు చేశారు? అలా చేయడం తప్పని తేలియదా? నిందితులకు భరోసా ఇవ్వడంలో మీ ఉద్దేశమేంటి?’’ ఇవీ వైసీపీ సోషల్‌ మీడియా ఇన్‌చార్జి గుర్రంపాటి దేవేందర్‌ రెడ్డికి సీబీఐ అధికారులు వరుస ప్రశ్నలు. అయితే ఆ ప్రశ్నలన్నింటికీ ‘‘మా అడ్వకేట్‌ సమాధానం చెబుతారు’’ అని మాత్రమే దేవేందర్‌ రెడ్డి నుంచి సమాధానాలు వచ్చినట్టు సమాచారం. ఈ కేసులో నోటీసులు అందుకున్న దేవేందర్‌ రెడ్డిని విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోమవారం ప్రశ్నించారు. ‘‘వైసీపీ సోషల్‌ మీడియా సైనికులకు విజ్ఞప్తి.. సీబీఐ అరెస్టు విషయంలో ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు.. అరెస్టైనవారికి న్యాయపరమైన సహాయ సహకారాలు అందించాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అంటూ దేవేందర్‌ రెడ్డి పేరుతో ఇటీవల ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ  విషయాన్ని సైతం ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. సోషల్‌ మీడియా నిర్వాహకులు ఎవరు? వారికి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు? తదితర వివరాలు కూడా రాబట్టినట్లు సమాచారం. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేసిన వారి వివరాలూ దేవేందర్‌ రెడ్డిని సీబీఐ అడిగినట్లు తెలిసింది. అయితే సీబీఐ కార్యాలయం ముందు వైసీపీ శ్రేణులు హల్‌చల్‌ చేశాయి. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినవారిలో ఇప్పటికే 20మందికిపైగా నోటీసులు జారీచేసిన సీబీఐ అధికారులు వరుసగా విచారణకు పిలుస్తూ సంకెళ్లు వేసి జైల్లో పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న 18 మందితోపాటు ఇతర దేశాల్లోని ఐదారుగురి పాత్రపైనా సీబీఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 

Updated Date - 2021-08-03T08:45:56+05:30 IST