ప్రేమంటూ బాలికను గర్భవతిని చేశాడు
ABN , First Publish Date - 2021-01-21T06:10:44+05:30 IST
తండ్రి లేకపోవడం.. తల్లి కూలి పనులకు వెళ్లడం.. బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం.. ఇదే అదునుగా భావించాడో ప్రబుద్ధుడు. ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి మైనర్ విద్యార్థినిపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పెళ్లనగానే ముఖం చాటేశాడు
పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
తూప్రాన్/మనోహరాబాద్, జనవరి 20 : తండ్రి లేకపోవడం.. తల్లి కూలి పనులకు వెళ్లడం.. బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం.. ఇదే అదునుగా భావించాడో ప్రబుద్ధుడు. ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి మైనర్ విద్యార్థినిపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. గర్భం దాల్చిన సదరు విద్యార్థినికి అబార్షన్ చేయించాడు. పెళ్లికి నిరాకరించడంతో తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జరిగింది. ఈ మేరకు మనోహరాబాద్ ఎస్ఐ రాజు బుధవారం వివరాలు తెలిపారు.. మనోహరాబాద్ మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. ఆమె తండ్రి మరణించగా.. తల్లి కూలి పనులు చేస్తుంటుంది. ఇంటి వద్ద ఒంటరిగా ఉంటున్న బాలికతో మనోహరాబాద్కు చెందిన కర్రెమైసి కుమార్(25) పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ల నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలతో బాలికతో సన్నిహితంగా ఉన్నాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అబార్షన్ అయ్యేటట్లు చేశాడు. కుమార్ను పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో.. ఆమె బంధువులతో వెళ్లి పెళ్లి చేసుకోమంటూ కుమార్ను అడగింది. కుమార్ నిరాకరించడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కుమార్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు వివరించారు.