ఇంకెన్నాళ్లో..?

ABN , First Publish Date - 2020-08-11T10:46:43+05:30 IST

నరసాపురం మండలం మాధవాయిపాలెం రేవుకు దాదాపు వందేళ్ళ చరిత్ర ఉంది.

ఇంకెన్నాళ్లో..?

 ఆరు నెలలుగా గోదావరిలో రాకపోకలు బంద్‌

ఉభయ గోదావరి జిల్లావాసులకు తప్పని కష్టాలు


నరసాపురం, ఆగస్టు 10 : నరసాపురం మండలం మాధవాయిపాలెం రేవుకు దాదాపు వందేళ్ళ చరిత్ర ఉంది. బ్రిటీష్‌ హయాం నుంచి నిత్యం వేలాది మంది ప్రజలు ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. రేవు చరిత్రలో రాకపోకలు నిలిచిన సందర్భాలు చాలా అరుదు. వరదలు, బంద్‌ల సమయాల్లో మినహా.. మిగిలిన అన్ని వేళల్లోనూ అందు బాటులో ఉంటుంది. అయితే ఈసారి ఆరు నెలలుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు నరసాపురం-సఖినేటిపల్లి రేవుల మధ్య పంటు, పడవలు నడవడం లేదు. లాక్‌డౌన్‌కు ముందే రేవును మూసివేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాట ప్రక్రియ కూడా పూర్తయింది. జూన్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సడలించింది. ఈ నేపథ్యంలో రైళ్లు, బస్సుల రాకపోకలకు అక్కడక్కడా అనుమతించింది. అయితే రేవులో రాకపోకలకు మాత్రం గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు.


ఈ కారణంగా తూర్పు నుంచి పశ్చిమకు చించినాడ వంతెన మీదుగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దాదాపు 20 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఈ కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని లంక గ్రామస్థులు అత్యవసర సమయాల్లో నానా కష్టాలు పడుతున్నారు. కనీసం పడవలకైనా అనుమతిస్తే లంక గ్రామాల్లోని రైతులు, పాల వ్యాపారులకు జీవనోపాధి ఏర్పడుతుంది. ఇటు అత్యవసర సమయాల్లో వైద్యం పొందేందుకు వీలుంటుంది. కానీ రేవును తెరిపించే విషయంలో నేతలెవరూ స్పందించకపోవడంతో ప్రజల కష్టాలు తీరడం లేదు. దీంతో రేవులో పడవల రాకపోకలకు ఇంకెన్నాళ్లు పడుతుందోనన్న సందేహం ఇరు జిల్లాల వాసుల్లో నెలకొంది.

Updated Date - 2020-08-11T10:46:43+05:30 IST