జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటా : టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-05-13T16:59:12+05:30 IST
కూకట్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు.
హైదరాబాద్/కూకట్పల్లి : కూకట్పల్లి నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియా విలేకరుల కుటుంబాలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన బుధవారం కూకట్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెలీకాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కరోనా సోకిన వారికి వైద్యసేవలు అందించడంతోపాటు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటానని వివరించారు. లాక్డౌన్తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారికి అవసరమైన ఆర్థిక సాయం, నిత్యావసరాలను అందిస్తానని చెప్పారు. ప్రతిరోజూ క్యాంపు కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని ఆపద సమయంలో నేరుగా గాని, ఫోన్ ద్వారా కాని తనను సంప్రదించి సేవలు పొందాలని సూచించారు. కరోనా కారణంగా ఒక్క జర్నలిస్టు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేపట్టానని ఆయన తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం పంపిణీ చేశారు. అల్లాపూర్, ఫతేనగర్, బాలాజీనగర్, కేపీహెచ్బీ డివిజన్లలో ఇద్దరు చొప్పున, బాలానగర్, కూకట్పల్లి, మూసాపేట డివిజన్లలో ఒక్కొక్కరు చొప్పున లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.