జయలలిత నివాసం ఆమె వారసులకే : హైకోర్టు

ABN , First Publish Date - 2021-11-24T22:25:09+05:30 IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత నివాసం

జయలలిత నివాసం ఆమె వారసులకే : హైకోర్టు

చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ‘అమ్మ’ జయలలిత నివాసం ‘వేద నిలయం’ ఆమె వారసులకే చెందుతుందని మద్రాస్ హైకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ బంగళాను స్మారక కేంద్రంగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఆమె వారసులకే దీనిని అప్పగించాలని ఆదేశించింది. జయలలిత మేనల్లుడు జే దీపక్, మేన కోడలు జే దీప దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ ఎన్ శేషశాయి ఈ ఆదేశాలు ఇచ్చారు. 


ఆళ్వార్ పేటలోని పొయెస్ గార్డెన్‌లో వేద నిలయం ఉంది. దీనిని స్మారక కేంద్రంగా మార్చడం కోసం గత ఏఐఏడీఎంకే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు జస్టిస్ ఎన్ శేషశాయి తీర్పు చెప్పారు.  ప్రభుత్వం జమ చేసిన నష్టపరిహారం సొమ్మును తిరిగి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లించాలని తెలిపారు. జయలలిత చట్టబద్ధ వారసులకు వేద నిలయాన్ని మూడు వారాల్లోగా అప్పగించాలని చెన్నై జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దివంగత జయలలిత చెల్లించవలసిన పన్నులు బాకీ ఉంటే, వాటి వసూలుకు తగిన చర్యలు తీసుకోవచ్చునని ఆదాయపు పన్ను శాఖకు తెలిపారు. 


వేద నిలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ, ఆమె పేరు మీద రెండు స్మారక కేంద్రాలు ఉండవలసిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. 


24,322 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వేద నిలయంలో జయలలిత దాదాపు 40 సంవత్సరాలు నివసించారు. తమిళనాడు రాజకీయాల్లో జరిగిన అనేక చారిత్రక నిర్ణయాలకు వేద నిలయం వేదికగా నిలిచింది. 


వేద నిలయాన్ని స్మారక కేంద్రంగా మార్చుతామని 2017లో అప్పటి ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. దీనిని లాంఛనంగా ప్రారంభించినప్పటికీ, సందర్శించేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. అదే సమయంలో జయలలితకు చట్టబద్ధ వారసులుగా దీప, దీపక్‌లను గుర్తిస్తూ అధికారిక ప్రకటన రావడంతో, వారిద్దరూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి, వేద నిలయాన్ని తమకే ఇవ్వాలని కోరారు. 


Updated Date - 2021-11-24T22:25:09+05:30 IST