హోరువానలోనూ సాగిన మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-28T02:29:06+05:30 IST

‘‘మాది నెల్లూరు.. మా రాజధాని అమరావతి’’ అంటూ నగరం నినదించింది. శనివారం నెల్లూరులో జరిగిన రాజధాని రైతుల మహా పాదయాత్రకు నగర ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు.

హోరువానలోనూ సాగిన మహాపాదయాత్ర

నెల్లూరు: ‘‘మాది నెల్లూరు.. మా రాజధాని అమరావతి’’ అంటూ  నగరం నినదించింది. శనివారం నెల్లూరులో జరిగిన రాజధాని రైతుల మహా పాదయాత్రకు నగర ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా లెక్కచేయక అమరావతి రైతులు అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు. వీరిని అనుసరిస్తూ నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం పాదయాత్ర జరిగిన 12 కిలోమీటర్ల పొడవునా పూలవర్షం కురిపించారు. సింహపురీయులు చూపించిన ప్రేమాభిమానాలకు రాజధాని రైతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అడుగడుగునా లభిస్తున్న ప్రజాదరణ తమ ఇన్నాళ్ల కష్టాన్ని మరిపిస్తోందని అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 


నెల్లూరు నగరంలో 12 కిలోమీటర్ల దూరం సాగిన యాత్రకు అడుగడుగునా ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. ఒకవైపు జోరు వాన కురుస్తుంటే మరోవైపు అంతకన్నా బలంగా పూల వాన కురిపించారు. పాదయాత్ర రైతులపై పూల వర్షం కురిపించడం కోసం ప్రత్యేకంగా బెంగళూరు నుంచి రెండు టన్నుల పూలు తెప్పించి మరీ స్వాగతించారు. 

Updated Date - 2021-11-28T02:29:06+05:30 IST