అటు శివుడు ఇటు కేశవుడు!

ABN , First Publish Date - 2021-01-29T06:57:28+05:30 IST

ఒకవైపు చూస్తే మహా విష్ణువు, మరోవైపు చూస్తే మహా శివుడు... ఇద్దరు ఒకే రాతిపై దర్శనమిచ్చే అరుదైన విగ్రహానికి నెలవు చిత్తూరు జిల్లాలోని అగస్త్యేశ్వర స్వామి ఆలయం.

అటు శివుడు ఇటు కేశవుడు!

ఒకవైపు చూస్తే మహా విష్ణువు, మరోవైపు చూస్తే మహా శివుడు... ఇద్దరు ఒకే రాతిపై దర్శనమిచ్చే అరుదైన  విగ్రహానికి నెలవు చిత్తూరు జిల్లాలోని అగస్త్యేశ్వర స్వామి ఆలయం. శివ, కేశవుల అద్వైతాన్ని చాటి చెబుతున్న ఈ క్షేత్రానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి.


‘శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే’,  ‘శివస్య హృదయం విష్ణుః - విష్ణోశ్చ హృదయం శివః’ అంటూ పరమేశ్వరుడు, మహా విష్ణువుల అభేదాన్ని వెల్లడించే శ్లోకాల సారం విగ్రహ రూపంలో అక్కడ కనిపిస్తుంది. ఏకశిలపై ఒక వైపు శివుడు, మరోవైపు కేశవుడు  కొలువైన ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తొండవాడ సమీపంలో... స్వర్ణముఖి నదీ తీరంలో ఉంది. అదే అగస్త్యేశ్వర స్వామి దివ్య క్షేత్రం. ఈ విగ్రహం పక్కనే రాతి బండపై శ్రీ వేంకటేశ్వరస్వామి పాదముద్ర ఉండడం మరో విశేషం. స్థల పురాణం ప్రకారం... పూర్వకాలంలో ఇక్కడ అగస్త్యుడి ఆశ్రమం ఉండేది. ఒక రోజు అగస్త్యుడు స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తూండగా శివలింగం కనిపించింది. దాన్ని నది ఒడ్డున ఆయన ప్రతిష్ఠించాడు. ఆగస్త్యుడు ప్రతిష్ఠించిన కారణంగా ఈ స్వామి ‘అగస్త్యేశ్వర స్వామి’ పేరుతో ప్రసిద్ధమయ్యాడు. ఈ క్షేత్రాన్ని ‘ముక్కోటి, అగస్త్య పూజిత విష్ణుపాదం’ అని కూడా పిలుస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. శ్రీనివాసుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని వివాహమాడాడు. తిరుమలకు పోతూ మార్గమధ్యంలో ఉన్న ఈ ఆశ్రమంలో అగస్త్యమునిని దర్శించుకున్నాడు. పసుపు వస్త్రాలతో కొండకు పోకూడదని ఆగస్త్యుడు సలహా ఇవ్వడంతో ఈ ఆశ్రమంలోనే ఆరు మాసాల శ్రీనివాసుడూ, పద్మావతి ఉండిపోయారు.


ఆకాశరాజు మరణానంతరం ఆయన రాజ్యం కోసం సోదరుడైన తొండమానుడు, కుమారుడు వసుదానుడు ఘర్షణకు దిగగా... అగస్త్యుడి సలహా మేరకు శ్రీనివాసుడు భాగ పరిష్కారం చేశాడు. ఆరు మాసాల తరువాత... తిరుమలలో తొండమానుడు ఆలయం నిర్మించాక ఇక్కడ తన ఉనికికి గుర్తుగా పాదముద్రను అనుగ్రహించి.. శ్రీనివాసుడు తిరుమలకు వెళ్ళాడు. ఈ పాదముద్ర స్వర్ణముఖినదిలో రాతి మండపంపై ఉంది. శైవ క్షేత్రంలో శ్రీనివాసుడి విడిదికి చిహ్నంగా... రాతి మండపంలో ఏకశిలపై శివకేశవులు విగ్రహం వెలసింది. స్వర్ణముఖినదిలో బండపై... రాతి మండపంలో శివకేశవులు, అయ్యప్పస్వామి, వేంకటేశ్వరస్వామి పాదముద్ర ఉన్నాయి. వందేళ్ళ క్రితం...  శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన నాటుకోటి శెట్టియార్లు అగస్త్యేశ్వరాలయాన్ని పునరుద్ధరించి, స్థానికులైన మొగిలి రెడ్లకు అప్పగించారు. వారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల క్రితం ఈ ఆలయ పునరుద్ధరణ మరోసారి జరిగింది. అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా అనేక చిన్న ఆలయాలు నిర్మించి, గణేశుడు, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీమహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. 


తొండమానుడు ఆలయం నిర్మించాక... తొండవాడలో తన ఉనికికి గుర్తుగా 

పాదముద్రను అనుగ్రహించి.. శ్రీనివాసుడు తిరుమలకు వెళ్ళాడు. ఈ పాదముద్ర 

స్వర్ణముఖినదిలో రాతి మండపంపై ఉంది.

Updated Date - 2021-01-29T06:57:28+05:30 IST