తెలుగుదేశం పార్టీని ఎవరూ కదిలించలేరు : చంద్రబాబు
ABN , First Publish Date - 2020-05-28T18:00:19+05:30 IST
తెలుగుదేశం పార్టీని ఎవరూ కదిలించలేరని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి : తెలుగుదేశం పార్టీని ఎవరూ కదిలించలేరని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ రెండో రోజు ప్రారంభమైంది. ఇవాళ దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి కావడంతో బాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అనంతరం మహానాడులో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ వ్యక్తి కాదు వ్యవస్థ అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జీవితం ఆదర్శనీయమని.. సేవకు నిలువెత్తు రూపమన్నారు.
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి..
‘మనపై బురదజల్లిన వారే బురదలో కూరుకుపోయారు. రాజకీయాల్లో ఎన్టీఆర్కు సాటిలేరు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించారు. సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. తెలుగుదనానికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. పేదలకు పట్టెడన్నం పెట్టడమే తన సిద్ధాంతమని ఎన్టీఆర్ చెప్పేవారు’ అని చంద్రబాబు తెలిపారు.
ఎవరూ కదలించలేరు..
‘తెలుగుదేశం ఎవరికీ భయపడదు. సవాళ్లు తెలుగుదేశానికి కొత్త కాదు. తెలుగుదేశాన్ని ఎవరూ కదిలించలేరు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడుతున్నారు. కార్యకర్తలే తెలుగుదేశం శక్తి. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. హత్యా రాజకీయాలు మాకు అలవాటు లేదు. డాక్టర్ సుధాకర్ విషయంలో వైసీపీ తీరు దుర్మార్గం. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయం’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.