కోడి మృతిపై పోలీసులకు మాజీ ఎమ్మెల్యే కుమారుని ఫిర్యాదు... పోస్టుమార్టం కోసం డిమాండ్!
ABN , First Publish Date - 2021-09-12T13:40:35+05:30 IST
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాలో...
మహారాజ్గంజ్: యూపీలోని మహారాజ్గంజ్ జిల్లాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక కోడి మృతి చెందిన నేపధ్యంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తన కోడికి విషమిచ్చి చంపేశారని అతను పోలీసుల ముందు ఆరోపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మహారాజ్గంజ్ జిల్లాలోని సింధూరియన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్ర కళ్యాణ్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న మాజీ ఎమ్మెల్యే దుఖీ ప్రసాద్ కుమారుడు రాజ్కుమార్ భారతి శనివారం పోలీస్ స్టేషన్లో ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు విన్నవారంతా ఆశ్చర్యపోయారు. తన కోడికి ఎవరో విషమిచ్చి చంపేసినట్లు ఆరోపించారు. మృతిచెందిన తన కోడికి వెంటనే పోస్ట్మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. చిలుకలు, పావురాలు, కోళ్లు మొదలైనవాటిని పెంచడం తనకు చాలా ఇష్టమని మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాజ్ కుమార్ భారతి తెలిపారు.