అనిల్ దేశ్‌ముఖ్ నివాసాలపై ఈడీ దాడులు

ABN , First Publish Date - 2021-08-06T23:11:15+05:30 IST

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్..

అనిల్ దేశ్‌ముఖ్ నివాసాలపై ఈడీ దాడులు

నాగపూర్: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సోదాలు చేపట్టింది. నాగపూర్‌లోని మూడు ప్రాంతాల్లో ఈ సాదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఆర్కెస్ట్రా బార్ల నుంచి పెద్ద మొత్తాన బలవంతంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ ఎదుర్కొంటున్నారు. ముడుపుల ఆరోపణల దుమారంతో కొద్దికాలం క్రితం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు దేశ్‌ముఖ్‌ను, ఆయన కుమారుడు హృషికేష్ దే‌శ్‌ముఖ్‌ను తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈడీ ఇటీవల పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయితే, ఈడీ ముందు ఇంతవరకూ ఆయన హాజరుకాలేదు.


ఆర్కెస్ట్రా బార్ల నుంచి 4.7 కోట్ల రూపాయలు వసూలు చేశారని సస్పెన్షన్‌కు గురైన సచిన్ వాజే చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనమయ్యాయి. దేశ్‌ముఖ్ ఆదేశాలతో ఆ డబ్బును మంత్రికి చెందిన ట్రస్టుకు ఇద్దరు హవాలా ఆపరేటర్ల ద్వారా ఆయన కుమారుడు మళ్లించారని, ఈ మొత్తాన్ని విరాళాలుగా ట్రస్టు చెబుతోందని ఈడీ ఆరోపిస్తోంది. ట్రస్టు అధ్యక్షుడిగా దేశ్‌ముఖ్ ఉండగా, ఆయన కుమారులు సలిల్, హృషికేష్ ట్రస్టీలుగా ఉన్నారు.   నాగపూర్, ముంబైలోని దేశ్‌ముఖ్ నివాసాలపై ఈడీ ఇటీవల కూడా దాడులు జరిపింది.

Updated Date - 2021-08-06T23:11:15+05:30 IST