వరదలతో మహారాష్ట్రలో పెను సంక్షోభం : శరద్ పవార్
ABN , First Publish Date - 2020-10-19T02:13:08+05:30 IST
మహారాష్ట్రలో వరదల వల్ల మునుపెన్నడూ లేనంత నష్టం జరిగిందని నేషనలిస్ట్
ముంబై : మహారాష్ట్రలో వరదల వల్ల మునుపెన్నడూ లేనంత నష్టం జరిగిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతాల్లో వరద బాధిత రైతులకు వేగంగా ఆర్థిక సాయం అందజేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రెండేళ్ళపాటు పంటలు పండించడానికి అవకాశం లేని రీతిలో భూములు పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను వరదలు నాశనం చేశాయన్నారు.
మరాఠ్వాడా ప్రాంతంలోని తుల్జాపూర్లో రైతులను ఉద్దేశించి ఆదివారం శరద్ పవార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతోనూ, కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చించి, రైతులకు ఆర్థిక సాయం అందేవిధంగా కృషి చేస్తానని చెప్పారు.
లక్షలాది హెక్టార్లలో పంటలకు నష్టం
మహారాష్ట్రలోని పుణే, కొంకణ్, ఔరంగాబాద్ డివిజన్లలో కురిసిన భారీ వర్షాల వల్ల 48 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. భూములు కోతకు గురయ్యాయి.