ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన పదేళ్ల బాలిక ఏమడిగిందంటే..

ABN , First Publish Date - 2021-08-13T03:09:26+05:30 IST

నిత్యం బిజీ బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవాలనుకుంటున్న 10 ఏళ్ల బాలిక కోసం బుధవారం ప్రత్యేకంగా సమయం కేటాయించారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన పదేళ్ల బాలిక ఏమడిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: నిత్యం బిజీ బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవాలనుకుంటున్న 10 ఏళ్ల బాలిక కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించారు. బుధవారం పార్లమెంట్‌లో తన కార్యాలయంలో చిన్నారిని కలుసుకున్న ప్రధాని ఆమెతో బోలెడన్ని కబుర్లు చెప్పారు. దీంతో..ఆ చిన్నారి సంబరానికి అంతేలేకుండా పోయింది. ఈ లక్కీ ఛాన్స్ కొట్టేసిన బాలిక పేరు అనీషా పాటిల్. లోక్‌సభ సభ్యుడు డా. సుజెయ్ వీఖే పాటిల్ కూతురే అనీషా పాటిల్. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ నియోజకవర్గానికి సుజెయ్ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 


ప్రధానిని కలుసుకునేందుకు తండ్రితో పాటు వెళదామని చిన్నారి పలు మార్లు ప్రయత్నించినా కుదరలేదు. ప్రధాని బీజీ షెడ్యూల్ కారణంగా అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమని డా. పాటిల్ కూతురికి చెబుతూ వచ్చారు. దీంతో..అనీషా ప్రధానికి స్వయంగా ఈ-మెయిల్ పంపింది. ‘‘సార్..నా పేరు అనీషా.. మీమ్మల్ని కలవాలని ఉంది.. అపాయింటె‌మెంట్ ఇవ్వరూ’’ అని విజ్ఞప్తి చేసింది. చిన్నారి ఈ-మెయిల్ చూసిన వెంటనే ఆమెకు అపాయింట్‌మెంట్ ఇచ్చేసిన ప్రధాని.. ‘‘పరిగెత్తుకుంటూ రా తల్లీ..అంటూ రిప్లై ఇచ్చారు. ఇక బుధవారం నాడు డా. పాటిల్ తన గదిలోకి అడుగుపెట్టిన వెంటనే ప్రధాని.. ‘అనీషా ఏదీ..’ అని ప్రశ్నించారు. 


ప్రధానిని తొలిసారిగా కలుసుకున్న ఆ చిన్నారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. ‘‘మీ ఆఫీసు ఎంత పెద్దగా ఉందో..?మీరు రోజంతా ఇక్కడే ఉంటారా..?అంటూ మోదీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధాని కూడా అంతే ఉత్సాహంగా బాలిక సందేహాలన్నీ తీర్చారు. ఇక వెళుతూ వెళుతూ..బాలిక ప్రధానిని అడిగిన ప్రశ్న ఈ మీటింగ్ మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. ‘సార్..మీరు గుజరాత్‌ వారేనటకదా..మరి మీరు భారతదేశానికి ప్రెసిడెంట్ ఎప్పుడు అవుతారు..? అని బాలిక అమాయకంగా అడగడంతో ప్రధానితో పాటూ అక్కడున్న వారంతా పడిపడి నవ్వారట. ప్రధానితో ఈ చిన్నారి దిగిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2021-08-13T03:09:26+05:30 IST