మహారాష్ట్రలో కొత్తగా మరో ఏడు ఒమైక్రాన్ కేసులు.. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి

ABN , First Publish Date - 2021-12-11T02:58:18+05:30 IST

మహారాష్ట్రలో ఒమైక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కొత్తగా మరో ఏడు ఒమైక్రాన్ కేసులు.. బాధితుల్లో మూడున్నరేళ్ల చిన్నారి

ముంబై: మహారాష్ట్రలో ఒమైక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో ఏడు కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17కి పెరిగింది.  తాజా కేసుల్లో నాలుగు పింప్రి చించల్‌వాడ్ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో నమోదు కాగా, మూడు ముంబైలో బయటపడ్డాయి.


పింప్రిచించల్‌వాడ్ బాధితులు ఓ నైజీరియా మహిళను కలవడంతో వైరస్ సోకగా, మిగతా ముగ్గురికి టాంజానియా, యూకే, సౌతాఫ్రికా ప్రయాణ చరిత్ర ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, బాధితుల్లో నలుగురికి వ్యాక్సినేషన్ కూడా పూర్తయిందని, ఒకరు సింగిల్ డోసు మాత్రమే వేసుకోగా, మరొకరు అసలే తీసుకోలేదని పేర్కొన్నారు.


టీకా తీసుకునేందుకు అర్హత లేని మూడున్నరేళ్ల చిన్నారి కూడా బాధితుల్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. నలుగురు బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవని, ముగ్గురిలో మాత్రం స్వల్ప లక్షణాలు ఉన్నాయని వివరించారు.

Updated Date - 2021-12-11T02:58:18+05:30 IST